
దండకారణ్యం మళ్లీ తుపాకీ మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. చత్తీస్ గఢ్ లో తాజాగా, శుక్రవారం నారాయణపూర్- దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్ట్ ల మధ్య చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.ఈ ప్రాంతంలో శుక్రవారం భద్రతా సిబ్బంది చేపట్టిన నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
2024 జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 122 మంది నక్సలైట్లు చనిపోయారు. నారాయణ్పూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీస్ అధికారులకు సమాచారం అందింది. దీంతో నారాయణ్పూర్, కొండగావ్, దంతేవాడ, జగ్దల్పూర్ జిల్లాల డీఆర్జీ బలగాలు, ఐటీబీపీ 45వ బెటాలియన్ భద్రతా బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.
ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. అయితే జవాన్లు సైతం నాలుగు వైపుల నుంచి మూకుమ్మడి దాడి చేయడంతో మావోయిస్టులు తప్పించుకునే మార్గం లేకపోయినట్లు తెలుస్తున్నది. దాడుల్లో సుమారు 1,200 మంది జవాన్లు పాల్గొన్నట్లు సమాచారం. దీంతో మావోయిస్టులు తప్పించుకునే దారిలేక కాల్పుల వేగాన్ని పెంచుకుంటూ అటవీ మార్గం నుంచి పారిపోయారు.
ఘటనా స్థలం నుంచి ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు కొన్ని ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో ముగ్గురు జవాన్లకు సైతం గాయాలైనట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్ సరిహద్దుకు సమీపంలోని భీమాంఖోజీలో నక్సల్స్ శిబిరాన్ని మహారాష్ట్ర పోలీసులు ఛేదించిన సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా పెద్ద మొత్తంలో నక్సల్స్ వస్తువులు, సాహిత్యం, మందులు, సంచులు, వండిన భోజనం, నిత్యావసరాలు స్వాధీనం చేసుకున్నారు. భీమన్ ఖోజి ప్రాంతంలోని టిపగడ్, కసన్సూర్ దళాలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు అదనపు ఎస్పీ కుమార్ చింతా ఆధ్వర్యంలో సి60 పార్టీలు, సీఆర్పీఎఫ్ కి చెందిన మరో బృందం గాలింపు చర్యలు చేపట్టారని గడ్చిబోలి పోలీసు సూపరింటెండెంట్ నీలోత్ పాల్ తెలిపారు.
సీ 60 కమాండోలు కొండపైకి రావడాన్ని చూసి మావోయిస్టులు దట్టమైన అడవుల్లోకి తప్పించుకున్నారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టామని గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. మే 23న నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులోని అడవిలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మరణించగా, మే 10న బీజాపూర్ జిల్లాలో 12 మంది హతమయ్యారు.
కాగా, ఏప్రిల్ 30న నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని అడవిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళలతో సహా 10 మంది నక్సలైట్లు మరణించగా, ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో 29 మంది మరణించారు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!