
ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని ఎంపీలకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో గురువారం పార్టీ ఎంపీలతో తొలి సమావేశం జరుపుతూ ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే దిల్లీలో పైరవీలు చేశారని ఆయన దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనమని చంద్రబాబు తెలిపారు. వ్యవస్థలకు ఆతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలని హెచ్చరించారు. పదవులు శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దని హితవు చెప్పారు.
మన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించాం, ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలను గౌరవించేలా నాయకులు పనిచేయాలని సూచించారు. 5 ఏళ్ల పాటు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొని పార్టీని కార్యకర్తలే నిలబెట్టారని కొనియాడారు. నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎంపీలుగా మంచి పనితీరు కనబరిచి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.
ఒక సామాన్యమైన కార్యకర్తకు, చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకులుగా ఉన్న మీరు, ఇతర నాయకులతో కూడా అలాగే ఉండాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడి, విధేయతతో ఉంటే పదవులు వస్తాయని దానికి విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడే ఉదాహరణ అని చెప్పారు.
అప్పలనాయుడుకు ఎంపీ టిక్కెట్ ఇస్తే చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని అయితే కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని పోయి కలిశెట్టి గెలిచాడని అభినందించారు. అప్పల నాయుడు ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా పార్టీలో ఉన్న సామాన్యులకు టిక్కెట్లు వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు వివరించారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం