రాజకీయ దుమారంతో సిఐడి చీఫ్ కు సెలవు రద్దు

రాజకీయ దుమారంతో సిఐడి చీఫ్ కు సెలవు రద్దు
రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ సంజయ్ కు నెలరోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవు మంజూరు చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. దానితో వెంటనే ప్రభుత్వం సెలవును రద్దు చేసింది.

సంజయ్​కు విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతివ్వడంపై విమర్శలు చెలరేగడం,  విదేశాలకు పారిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కలకలం చెలరేగడంతో  ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంజయ్ మాత్రం తానే సెలవు రద్దు చేసుకున్నట్లు తెలిపారు.

దీనితో ఈ నెల 6వ తేదీన వ్యక్తిగత పనుల పై అమెరికా వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని సంజయ్ వెనక్కు తీసుకున్నారు. జగన్ పాలనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో సా సహా ఆ పార్టీ ముఖ్యనేతలు, ఇతరులపై తోచినట్లు తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు ఇలా పలు నిర్ణయాలతో అత్యంత వివాదాస్పద అధికారిగా సీఐడీ ఏడీజీ సంజయ్‌ నిలిచారు.

తప్పుడు కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించిన సంజయ్, బుధవారం నుంచి నెల రోజుల పాటు సెలవు కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌కు అర్జీ పెట్టుకున్నారు. అయితే ఈ సెలవులను సంజయ్‌లానే వివాదాస్పదంగా వ్యవహరించిన సీఎస్‌ జవహర్ రెడ్డి ఆయనకు నెల రోజులు సెలువు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 పేరుకు వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటన వెళ్లేందుకంటూ ఆయన దరఖాసుకున్నా, ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో పాటు రేపో మాపో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న తరుణంలో విదేశాలకు పయనమవడం గమనార్హం.  దీంతో ఇంత కాలం సంజయ్‌ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న కూటమి కార్యకర్తలు, ఆయన సెలువు పెట్టడంపై సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ట్రోల్‌ చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో భయపడి సెలువు పెట్టారంటూ మీమ్స్‌, ట్వీట్స్‌ చేస్తూ కామెంట్స్‌ చేశారు. 

లోకేశ్‌ రెడ్‌ బుక్‌లో సంజయ్‌ పేరుందని, అందుకే ఆయన అస్సామ్‌ ట్రైన్​ ఎక్కేస్తున్నారంటూ ట్రోల్స్‌ చేశారు. సంజయ్‌ను అరెస్టు చేసి విచారిస్తే జగన్‌ పాలనలో జరిగిన కుంభకోణాలు అన్నీ బయటకు వస్తాంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది.