వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్లలో ఎన్డీయే కూటమి విజయానికి కారణమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్కుమార్లకు అభినందనలు తెలియజేశారు. మూడో దఫా అధికారం చేపట్టాక, అవినీతిని రూపుమాపటంపై ఎక్కువగా దృష్టి సారిస్తామని వెల్లడించారు.
బీజేపీ మెజార్టీ మార్క్ను అందుకోలేకపోయినా, వివిధ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిందని చెప్పుకున్నారు. “మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, దిల్లీలో దాదాపు క్లీన్ స్వీప్ చేశాం. దేశంలోని కోట్ల మంది మహిళలు మమ్మల్ని ఆశీర్వదించారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నాం. మేం రాకముందు దేశ ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. 2014కి ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవి. మా సేవలు చూసే ప్రజలు మూడోసారి పట్టం కట్టారు. ఈసారి మహిళలు భారీగా ఓటింగ్లో పాల్గొని గత రికార్డులు తిరగరాశారు” అని మోదీ చెప్పారు.
“12 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించాం. నాలుగు కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించాం. దేశ హితం కోసం నిత్యం ఆలోచిస్తాం. ఆ దిశగా అడుగులు వేస్తాం. మేం చేపట్టిన పనుల వల్ల దేశం ప్రగతిపథంలో పయనిస్తోంది. మీ ఆశీర్వాదమే నిరంతరం పనిచేసేందుకు నాకు ప్రేరణ కలిగిస్తోంది. మీరిచ్చిన స్ఫూర్తితో రోజుకు 18గంటలు పనిచేస్తున్నా” అని చెప్పుకొచ్చారు.
ఎన్నికల ప్రక్రియ చూసి ప్రజలంతా గర్వపడుతున్నారని చెబుతూ సార్వత్రిక ఎన్నికలు మన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలని, మన ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఉత్సాహంతో చూశాయని మోదీ తెలిపారు. సుదీర్ఘకాలంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. భారత ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల వ్యవస్థ, విశ్వసనీయత కలిగి ఉన్నందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం పట్ల ప్రజల విశ్వాసానికి లభించిన విజయమని ప్రధాని అభివర్ణించారు.

More Stories
చండీగఢ్ బిల్లుపై దుమారం…. నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం
రిజర్వేషన్ జీవోకు మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా?
ఢిల్లీ ఉగ్రదాడికి స్వయంగా రూ 26 లక్షలు సమకూర్చిన వైద్యులు!