44 శాతం పెరిగిన దళిత విద్యార్థుల అడ్మిషన్లు

44 శాతం పెరిగిన దళిత విద్యార్థుల అడ్మిషన్లు
షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థుల అడ్మిషన్లు 2014 నుంచి 2022వ సంవత్సరం నాటికి 44 శాతం పెరిగాయని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ (ఎన్‌సీబీసీ) వెల్లడించింది. అదే సమయంలో దళిత బాలికల అడ్మిషన్లు 51 శాతం, మైనారిటీ బాలికల అడ్మిషన్లు 42.3 శాతం, గిరిజన విద్యార్థుల అడ్మిషన్లు 65.2 శాతం, గిరిజన బాలికల అడ్మిషన్లు 80 శాతం, ఓబీసీ విద్యార్థుల అడ్మిషన్లు 45 శాతం, ఓబీసీ బాలికల అడ్మిషన్లు 49.3 శాతం పెరిగాయని తెలిపింది. 
 
ఓబీసీల రాజ్యాంగపరమైన హక్కుల పరిరక్షణకు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలియజేస్తూ ఎన్‌సీబీసీ చైర్మన్‌ హన్సరాజ్‌ గంగారామ్‌ అహిర్‌ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు. 2014-15 సంవత్సరంలో 46.1 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు వివిధ విద్యాసంస్థల్లో చేరగా, 2021-22 సంవత్సరంలో ఆ సంఖ్య 66.2 లక్షలకు చేరిందని తెలిపారు.

అలాగే, 2014-15లో 10.7 లక్షల మంది మైనారిటీ బాలికలు వివిధ విద్యాసంస్థల్లో చేరగా, 2021-22లో ఆ సంఖ్య 15.2లక్షలకు పెరిగింది. 2014-15లో 16.41 లక్షలమంది ఎస్టీ విద్యార్థులు వివిధ విద్యాసంస్థల్లో చేరగా, 2021-22లో వారి సంఖ్య 27.1 లక్షలకు పెరిగింది.  ఇక 2021-22లో 1.63 కోట్ల మంది ఓబీసీ విద్యార్థులు వివిధ విద్యాసంస్థల్లో చేరారు. 2020-21 విద్యా సంవత్సరంలో సెంట్రల్‌ స్కూళ్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల 34,133 మంది ఓబీసీ పిల్లలు అడ్మిషన్లు పొందగలిగారు.

 అదే ఏడాది ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ను నవోదయ స్కూళ్లలో అమలుచేయడం వల్ల మరో 19,710 మంది, సైనిక్‌ స్కూళ్లలో అమలు చేయడం వల్ల మరో 1,026 మంది ఓబీసీ పిల్లలకు మేలు జరిగిందని నివేదిక తెలిపింది. కాగా, ఉన్నత విద్యలో మహిళల అడ్మిషన్లు 32 శాతం పెరిగాయి.