
పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఐదుగురు అంతకుమించి గుమిగూడవద్దని పోలీసులు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఏ లైసెన్సు కింద అనుమతి ఉన్నప్పటికీ మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
13వ తేదీన పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు రెండు క్యూలైన్లలో నిలబడాలని.. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్లు హెచ్చరించారు.
ఆంక్షల సమయంలో మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధమని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదని చెప్పారు. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధమని తెలిపారు.
పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ దూరంలో కర్రలతో కూడిన జెండాలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధమని పేర్కొన్నారు. ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వినియోగించరాదని తెలిపారు. మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలను మూసేయాలని, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం అమ్మకాలకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఆదేశాలు జారీచేశారు.
అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టంచేశారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13న సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల అధికారి ఆదేశించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత