ఎన్నికల వేళ కుట్ర… సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు

ఎన్నికల వేళ కుట్ర… సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు
 
ఏపీలో ఎన్నికల వేళ కూటమిపై కుట్ర జరుగుతోందని బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి  దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్‌లపై తాను మాట్లాడినట్లుగా ఫేక్ వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వార్తను నమ్మొద్దని.. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ బీజేపీ నినాదం అని ఆమె స్పష్టం చేశారు. 
 
అంటే సమాజంలోని అందరినీ కలుపుకొని అందరినీ అభివృద్ధి వైపు నడిపించడమే బీజేపీ అభిమతం అని ఆమె తెలిపారు. ఇందుకు భిన్నంగా ట్రోల్‌ అవుతున్న ఫేక్ వార్తను నమ్మొద్దని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. కాగా, రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల్లో పురందేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణ చూసి, ఓర్వలేక వైఎస్సార్‌సీపీ పెయిడ్‌ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో ఆమె అనని వ్యాఖ్యలను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పదేపదే ఫేక్‌ న్యూస్‌ సృష్టించి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లంకా దినకర్‌ ఈసీకి విజ్ఞప్తిచేశారు. ప్రతిసారి ఎన్నికలు రాగానే రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుందని చెబుతూ నకిలీ వార్తలపై సైబర్‌ క్రైంకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 
 
 వైఎస్సార్‌ ప్రభుత్వం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు అన్యాయంగా కట్టబెట్టిందని పురందేశ్వరి ఆరోపించినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కూటమి గెలిచిన వెంటనే ఆ రిజర్వేషన్ల రద్దుపై తొలి సంతకం చేసేందుకు చంద్రబాబు, పవన్‌ సానుకూలంగా స్పందించారని పురందేశ్వరి ప్రకటించినట్లు ఇతర వెబ్‌సైట్ల లోగోలతో వైరల్‌ చేశారు. దీంతో బీజేపీ స్పందించింది.