ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కోసం పోలీసుల పాట్లు

ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కోసం పోలీసుల పాట్లు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ మలుపులు తీసుకోవడంతో ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుని ఎలా రప్పించాలనే దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆయన ఎక్కడ? ఆయనను కాపాడుతున్నది ఎవరు?  తెలియక తికమకపడుతున్నారు.  కేసు నమోదు చేసి 25 రోజులు కావస్తున్నా ప్రభాకర్‌రావును టచ్ చేయకుండా కాపాడుతున్నది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది.

మరోవైపు ప్రభాకర్‌రావు అమెరికాలో తలదాచుకున్నాడనే సమాచారం ఉందని చెబుతున్నారు.  అదే సమయంలో ఇంటర్‌పోల్ సహాయం తీసుకొని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా హైదరాబాద్ పోలీసులు ఎందుకు ప్రయత్నం చేయట్లేదనే దానిపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, కేసులో నిందితుడని తెలిశాక హైదరాబాద్ సిపికి ప్రభాకర్‌రావు ఫోన్ చేయడం చర్చనీయాంశమైంది. 

మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తానని సమాచారం ఇచ్చి మరీ ప్రభాకర్‌రావు అందుబాటులో లేకుండా పోవడంతో. ఆయన దుబాయ్‌లో తలదాచుకుని ఉండవచ్చని పోలీసు వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోందని సమాచారం. అయితే దుబాయ్ వెళ్లి అఫ్రూవర్‌గా మారొద్దంటూ ప్రభాకర్‌రావుకు ఓ పార్టీ నేతలు హెచ్చరించారని అంటున్నారు.

ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌రావు భారత్ లో అడుగు పెట్టిన వెంటనే అరెస్టు చేసి అవకాశం ఉందని తెలిసింది. మరీ ప్రభాకర్‌రావు భారత్ కు వస్తారా? క్యాన్సర్ చికిత్స పేరుతో కాలయాపన చేస్తారా? అన్న సందేహాలు సైతం పోలీసులు వ్యక్తపరుస్తున్నట్లు తెలిసింది.  అయితే, ప్రభాకర్‌రావు వస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు చిక్కుముడులకు సమాధానం లభిస్తుందనేది పోలీసుల అభిప్రాయంగా వినవస్తోంది. పైగా, ఇప్పటికే అరెస్ట్ అయినవారు బెయిల్ పిటీషన్లు దాఖలు చేసేందుకు కూడా ఆయన రావడం అనివార్యంగా భావిస్తున్నారు.

కాగా,  టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు ఈనెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో రాధాకిషన్‌ రావు కస్టడీ ముగియడంతో ఆయనను ఉదయం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమారు 10 మంది రాజకీయ నేతలపై కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వారందరిని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉంది.