ఇండియా కూటమిలో భాగంగా ఉన్న టీఎంసీ తాను అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్లో అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థానాల్లో పోటీకి సంబంధించి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగాలని పదేపదే తమ పార్టీ కోరుకున్నదని, అయితే టీఎంసీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించిందని విమర్శించారు.
మమతపై కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్తో సీట్ల పంపిణీ ఒప్పందాన్ని కుదుర్చుకోకుండా మమత పీఎంవోకు(ప్రధాని కార్యాలయం) ‘ఒక సందేశం’ పంపారని ధ్వజమెత్తారు. తన వంటి నాయకులను దేశంలోని ఏ రాజకీయ పార్టీ నమ్మకూడదని మమత నిరూపించారని మండిపడ్డారు.
ఇండియా కూటమిలో కొనసాగితే, అది ప్రధాని మోదీకి నచ్చదనే భయం ఆమెలో ఉన్నదని, దీంతో కూటమి నుంచి దూరం పోవడం ద్వారా.. ‘నా పట్ల అసంతృప్తిగా ఉండొద్దు. నేను బీజేపీకి వ్యతిరేకంగా నిలబడటం లేదు’ అనే సందేశాన్ని మమత పీఎంవోకు ఇచ్చారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమి కకావికలమవుతున్నది. కాంగ్రెస్ తీరుతో మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా కూటమికి దూరం అవుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఇటీవలే బీజేపీ పక్షాన చేరారు.
ఇక కేరళలో సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రత్యర్థులుగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఒక కూటమిలో ఉంటుండగా రాహుల్ గాంధీ కేరళలో పోటీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్డిఎఫ్ ఆయనపై సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా భార్యనే పోటీకి దింపింది.
ఢిల్లీ, హర్యానా, గుజరాత్ లలో సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పటికీ కీలకమైన పంజాబ్ లో ఆప్, కాంగ్రెస్ ఎవ్వరి దారి వారుగా మారింది. రెండు పార్టీలు ఎవ్వరికీ వారుగా అన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోనూ ముసలం మొదలైంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే, ముంబై వాయువ్య సీటుకు శివసేన ఉద్ధవ్ వర్గం తాజాగా అభ్యర్థిని ప్రకటించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు జార్ఖండ్లో 14కిగానూ 8 స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని సీపీఐ ఆదివారం ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ చర్చలు జరుపడం లేదని, అందుకే సొంతంగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకొన్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహేంద్ర పాఠక్ తెలిపారు.
More Stories
స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ దాటవేత
‘అధిక సంతానం’ ముస్లింల గురించి కాదు.. పేదల గురించి
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ