క్యాన్సర్‌ను జయించిన ఇస్రో చైర్మన్‌

క్యాన్సర్‌ను జయించిన ఇస్రో చైర్మన్‌

చంద్రయాన్‌-3 ప్రయోగం విజయంతో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్ (ఇస్రో) చైర్మన్  ఎస్.  సోమనాథ్‌  క్యాన్సర్‌  బారిన పడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆదిత్య-ఎల్ 1 లాంచ్ రోజున తనకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినట్లు ఇస్రో చీఫ్ తెలిపారు.

తార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన మలయాళ ఇంటర్వ్యూలో సోమనాథ్‌ మాట్లాడుతూ చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని సోమనాథ్ తెలిపారు. అయితే, ఆ సమయంలో క్యాన్సర్ ఉందనే విషయం తనకు స్పష్టంగా తెలియదని, దాని గురించి స్పష్టమైన అవగాహన కూడా లేదని చెప్పుకొచ్చారు.

‘‘చంద్రయాన్‌-3 ప్రయోగం సమయంలోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అయితే.. ఆ సమయంలో నాకు దానిపై స్పష్టమైన అవగాహన లేదు. కానీ.. ఆదిత్య-ఎల్‌1 మిషన్‌ ప్రయోగించిన ఉదయమే నేను వైద్య పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో ఏదో సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆదిత్య-ఎల్1 ప్రయోగం ముగిశాక నేను చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్‌లు చేయించాను. అప్పుడే నా కడుపులో కణితి పెరిగిందన్న విషయం నాకు తెలిసింది. రెండు, మూడు రోజుల తర్వాత నేను క్యాన్సర్ బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులతో పాటు సహోద్యోగులు షాక్‌కు గురయ్యారు’’ అని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాధి తనకు వంశపారంపర్యంగా వచ్చినట్లు పరీక్షల్లో తేలిందన్న ఆయన.. ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు. ఆపరేషన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. శస్త్రచికిత్సతోపాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి బయటపడిన తర్వాత తొలుత కాస్త కంగారు పడినట్లు చెప్పారు. అయితే క్యాన్సర్‌కు చికిత్స ఉందన్న విషయంపై ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చిందని,  ప్రస్తుతం క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు.