‘గగన్యాన్’ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోదీ!

‘గగన్యాన్’ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోదీ!

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్​యాన్​’ – భారత దేశ తొలి మానవసహిత అంతరిక్ష మిషన్​లో ప్రయాణించే నలుగురు వ్యోమగాముల పేర్లను మంగళవారం  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వారు గ్రూప్​ కెప్టెన్​ పీ బాలకృష్ణన్​ నాయర్​, గ్రూప్​ కెప్టెన్​ అజిత్​ కృష్ణన్​, గ్రూప్​ కెప్టెన్​ అంగద్​ ప్రతాప్​, వింగ్​ కమాండర్​ ఎస్​ శుక్లా. వీరందరికి ‘అస్ట్రోనాట్​ వింగ్స్​’ని ఇచ్చారు మోదీ.

కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని  తిరువనంతపురంలోని వీఎస్​ఎస్​సీ (విక్రమ్​ సారాభాయ్​ స్పేస్​ సెంటర్​)ని సందర్శించారు. గగన్​యాన్​ మిషన్​ ప్రగతిని సమీక్షిస్తూ  మిషన్​ కోసం సన్నధమవుతున్న వ్యోమగాములను కలిశారు. ఆ తర్వాత వారందరిని ప్రపంచానికి పరిచయం చేశారు.

2024-25 మధ్యలో ఈ గగన్​యాన్​ మిషన్​ని ప్రయోగించాలని ఇస్రో ప్రణాళిక వేసింది. అంతరిక్షంలో ఎర్త్​ ఆర్బిట్​లో మూడు రోజుల పాటు వ్యోమగాములను ఉంచి, వారిని సురక్షితంగా భారత్ కు తీసుకురావడమే ఈ మిషన్​ లక్ష్యం. మిషన్​ కోసం వ్యోమగాములు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. టెక్నికల్​ స్కిల్స్​తో పాటు ఫిజికల్​ ఫిట్​నెస్​పై అధిక దృష్టి పెట్టారు.

“గగన్​యాన్​లో ప్రయాణించే నలుగురి పేర్లు ఇప్పుడు భారత్ కు తెలిసింది. ఈ నలుగురు కేవలం ప్రయాణికులు మాత్రమే కారు! 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకు వెళ్లే శక్తులు.  40ఏళ్ల తర్వాత  ఓ భారతీయులు అంతరిక్షంలోకి వెళుతున్నారు. కానీ ఈసారి కౌంట్​డౌన్  మనది, రాకెట్ మనది” అంటూ ప్రధాని ప్రకటించారు.

1988లో సోవియట్​ యూనియన్​ తరఫును వింగ్​ కమాండర్​ రాకేశ్​ శర్మ (రిటైర్డ్​)  అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. “ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతున్న సమయంలో గగన్​యాన్​ మిషన్​ జరుగుతుండటం అంతరిక్షణ రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది,” అని మోదీ అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ ఏజెన్సీల వద్ద ఉన్న కటింగ్​ ఎడ్జ్​ టెక్నాలజీతో పాటు భారత దేశంలోని నిపుణులు, పరిశ్రమ అనుభవం​, అకాడమియా సామర్థ్యాలు, పరిశోధనా సంస్థల నైపుణ్యాలను వినియోగించుకుంటూ గగన్​యాన్​ కోసం ముందుకు వెళుతోంది ఇస్రో.

కేర‌ళ‌లో రెండు అంకెల సీట్లు గెలుస్తాం

  కాగా, రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లో బీజేపీకి రెండు అంకెల‌ సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌ధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు. సెంట్ర‌ల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొంటూ కేర‌ళ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను, ఆశ‌యాలు నిజం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం త‌న గ్యారెంటీగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. కేర‌ళ రాష్ట్రాన్ని తమ పార్టీ ఎన్న‌డూ ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌తో చూడ‌లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.
2019లో బీజేపీ ఓట్ల శాతం రెండు అంకెలు దాటింద‌ని, ఇక 2024లో బీజేపీ రెండు అంకెల సీట్ల‌ను గెలుచుకోబోతోంద‌ని వెల్లడించారు.  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 400 సీట్ల లక్ష్యంతో ప‌నిచేస్తున్న బీజేపీకి కేర‌ళ కూడా భాగ‌స్వామ్యం అవుతుంద‌ని ప్ర‌ధాని మోదీ ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించ‌కున్నా.. కేంద్ర స‌ర్కారు కేర‌ళ‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఇచ్చింద‌ని తెలిపారు.  సీపీఎం అవినీతికి పాల్ప‌డుతోంద‌ని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటున్న‌ట్లు ఆయ‌న ధ్వజమెత్తారు.