పార్లమెంటు ఎన్నికల కోసం బిజెపి 35 కమిటీలు

పార్లమెంటు ఎన్నికల కోసం బిజెపి 35 కమిటీలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర ప్రారంభించాలని నిర్ణయించిన ఆ పార్టీ తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం 35పైగా కమిటీలు వేయాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల కమిటీ సమావేశమై ఒక్కో ఎంపీ స్థానం నుంచి ముగ్గురేసి ఆశావహుల పేర్లను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపించాలని నిర్ణయించింది.

ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా కిషన్ రెడ్డి ఇప్పటికే నియమితులయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీకి కో- కన్వీనర్‌లుగా ఏవీఎన్ రెడ్డి, గరికపాటి, రామచందర్‌రావులను నియమించారు.

మరోవైపు ఎన్నికల కార్యాలయం ప్రముఖ్‌గా రంగారెడ్డి, సహా ప్రముఖ్‌గా కొల్లి మాధవిలు నియమితులయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ప్రముఖ్‌గా లక్ష్మణ్‌కు మరో బాధ్యతను అప్పగించగా, పార్టీ ఛార్జిషీట్ కమిటీ ప్రముఖ్‌గా సీనియర్ నాయకుడు మురళీధర్ రావుకు బాధ్యతలు అప్పగించారు. 

మీడియా కమిటీ ప్రముఖ్‌గా కృష్ణ సాగర్ రావు, మీడియా రిలేషన్స్ కమిటీ ప్రముఖ్‌గా ప్రకాష్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీకి పోరెడ్డి కిషోర్ రెడ్డి, ఎన్నికల కమిషన్, లీగల్ ఇష్యూస్ కమిటీ ప్రముఖ్‌గా ఆంథోనీ రెడ్డిలను పార్టీ నియమించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.