తూర్పు కనుమలలో గిరిజన సాంస్కృతిక యాత్ర

తూర్పు కనుమలలో గిరిజన సాంస్కృతిక  యాత్ర
`జనజాతి ఆత్మ గౌరవ యాత్ర’  పేరుతో జరిగిన  తూర్పు కనుమలలో గిరిజన సాంస్కృతిక యాత్ర ద్వారా గిరిజనులలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రయత్నం జరిగింది.  ఒరిస్సా కేంద్రంగా తూర్పు కనుమల అటవీప్రాంతంను పాలించిన రాజుల ముఖ్య పట్టణం జైపూర్ నుండి జనవరి 25న ప్రారంభమై 11 రోజుల అనంతరం ఫిబ్రవరి 4న విశాఖపట్నంకు చేరుకుంది. 
 
జైపూర్ లోని సూర్య మహల్ ప్రాంగణంలో ఉన్న మహారాజా విక్రమ దేవ్ వర్మ1 విగ్రహానికి పూలమాల వేసి  యాత్ర ప్రారంభ సభను అక్కడే నిర్వహించారు. సభలో రాజ మాత శ్రీమతి సారిక దేవి, (మహారాజ విక్రమ దేవ్ వర్మ మనుమడి భార్య) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  
రథంపై ఇరువైపులా దేశ స్వేచ్చా స్వాత్రంత్యాల కొరకు, ధర్మ రక్షణకు బలిదానాలు చేసిన గిరిజన యోధులైన భగవాన్ బిర్శా ముండా, అల్లూరి సీతారామరాజు, గంటం దొర,…మొదలైన వీరుల ఫోటోలు, రథం ముందు భాగాన భారతమాత, మత్స్య గుండంలోని దేవత ఫోటోలు వున్నాయి. వీటిని ఎంతో ఆసక్తిగా గిరిజనులు చూసారు.
 
ఒడిస్సా అంతటా రథంలో జగన్నాథుని మూర్తులు ఉన్న కారణంగా రథంపైకి ఎక్కి జగన్నాథుడు తమ  గ్రామానికి వచ్చాడని గిరిజనులు భక్తితో రథాన్ని స్వాగతించారు. ప్రతి గిరిజన గ్రామంలో రథంతో వచ్చిన వారికి, గిరిజన తల్లులు వారి సాంప్రదాయిక పద్ధతిలో కాళ్ళు కడిగి స్వాగతించారు.
 
11 రోజుల యాత్ర ద్వారా గిరిజనులలో తమ సంస్కృతి,జీవన విధానం పట్ల ఆత్మ గౌరవం కల్గించడం ప్రధాన ఉద్దేశం. ఈ యాత్రలో 21 చోట్ల గిరిజన గ్రామాల్లో  సభలు జరిగాయి. అరకులోయ, పాడేరులలో భారీ గిరిజన సభలు జరిగాయి. సమరో 22 గిరిజన గ్రామాల్లో  రథానికి గిరిజనులు స్వాగతం పలికారు.అక్కడా సభలు జరిగాయి.
 
ప్రతి గిరిజన గ్రామంలో తమ తమ  సాంప్రదాయక పద్ధతిలలో యాత్రకు మహిళలు కలశాలతో స్వాగతం, వీడ్కోలు  పలికారు. గిరిజన మహిళలు తమ సాంప్రదాయిక పాటలను పాడారు.ప్రతి సభలోను వివిధ రంగాలలో సేవ చేస్తున్న మూలికా వైద్యులు, గిరిజన పూజారులు, వివిధ స్థాయిల్లో బహుమతులు అందుకున్న ఆటగాళ్ళు….. ఇలాంటి వారికి సన్మానం జరిగింది.
 
యాత్ర వెంబడి వస్తున్న అందరికీ ఈ గిరిజన గ్రామాల్లోనే భోజనం, వసతులను గిరిజనులు ఎంతో ఆప్యాయంగా ఏర్పాటు చేశారు.   ఈ యాత్ర ద్వారా గిరిజనేతర ప్రజల్లో గిరిజనుల సంస్కృతి జీవన విధానం ఎంతో గొప్పవని అర్థం చేయించడం, గిరిజనులు మా సోదరులే! అనే బంధు భావనను కల్గించడం ఈ యాత్ర రెండవ ఉద్దేశం.
 
ఒరిస్సా జైపూర్, విజయనగరం, ఆనందపురం,సింహాచలం, విశాఖ నగరంలలో జరిగిన సభలు ఈ కోవకు చెందినవే! పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు ఈ సభలకు హాజరు అయి,యాత్ర సందేశాన్ని విన్నారు.
 
రథ యాత్ర సభలలో శ్రీమతి వేంకట రమణమ్మ(రాష్ట్ర ఎస్టీ కమీషన్ సభ్యురాలు), దూసి రామ కృష్ణ ( జాతీయ అధ్యక్షులు, విద్యా భారతి), పొన్నపల్లి సోమయాజులు (వనవాసి కళ్యాణ ఆశ్రమం, మార్గదర్శకులు), గిరీష్ కుబెర్ (జనజాతి రక్షా ప్రముఖ, వనవాసి కళ్యాణ ఆశ్రమం) శ్యాం ప్రసాద్ (జాతీయ కన్వీనర్, సామాజిక సమరసత), డా.నిరంజన్ మిశ్రా  (లా కళాశాల మాజీ ప్రినిసిపాల్, జైపూర్), డా. జీ.వి.శేష గిరి రావు (ఆంధ్ర హాస్పిటల్స్, విజయనగరం) వంతు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. 
 
అనేక మంది గిరిజన నాయకులు వక్తలుగా పాల్గొన్నారు. అన్ని చోట్ల గిరిజన యువతీ,యువకులే ప్రధాన వక్తలు. జగన్నాథుని మూర్తితో గల రథానికి 26వ తేదీన కోరాపుట్ జిల్లాలో ఒకే రోజు ఏడు గిరిజన గ్రామాల్లో ఇంటింటా మహిళలు స్వాగతం పలికిన తీరు యాత్రలో ఒక మధుర అనుభూతి.
 
జైపూర్ రాజుల ఒక నాటి ముఖ్య పట్టణం, చారిత్రిక  కేంద్రం నందపూరులో స్థానిక సభ, పాడేరు వద్ద  పుణ్య క్షేత్రం మత్స్య గుండం వద్ద యాత్రలో జరిగిన సభాకార్యక్రమాలు ఎంతో ముఖ్యమైనవి. మన కళాకారుడు దుర్గా ప్రసాద్  యాత్రపై వ్రాసిన పాట “ఈ తూర్పు కనుమలలో గిరిజన సాంస్కృతిక యాత్రకు తరలి రండహో”  యాత్రమార్గంలో అడవీ ప్రాంతంలో మారు మ్రోగింది.

ఇంతవరకు గిరిజనుల హక్కుల రక్షణకు అనేకమంది సభలు, యాత్రకు,ఉద్యమాలు చేశారు. గిరిజన సంస్కృతి, జీవన శైలి గొప్పతనాన్ని తెలియచేస్తూ ఇలా యాత్ర చేయడం  ఒక విశేషం. వనవాసి కళ్యాణ ఆశ్రమం, విజయనగరం కేంద్రీయ విశ్వవిద్యాలయం, వారి కార్యకర్తలు చేసిన కృషి విజయవంతం అయింది అనడంలో సందేహం లేదు. 

ఈ యాత్రకు యాత్రా ప్రముక్ గా ఉబ్బేటి నాగేశ్వర రావు, యాత్ర సహ ప్రముఖ్  గా మోహన్ వ్యవహరించగా, ఏర్పాట్లను విద్యాధర మహంతో (వనవాసి కళ్యాణ ఆశ్రమం ఆంధ్ర ప్రదేశ్ సంఘటనా కార్యదర్శి) నిర్వహించారు.