పాకిస్థాన్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 22 మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రావిన్స్లోని బజౌర్ జిల్లాలోని మాముంద్ తహసీల్లో చోటు చేసుకుంది.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో సోమవారం ఉదయం పోలియో వ్యాక్సిన్ వేసేవారికి భద్రత కల్పించేందుకు వెళ్లిన పోలీసులే లక్ష్యంగా ఈ బాంబు పేలుడు జరిగింది. పోలీసులు పోలియో టీకా బృందాలతో కలిసి వ్యానులో ఎక్కిన సమయంలో పేలుడు జరిగినట్లు తెలిపారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.దీంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించినట్లు ప్రకటించారు. ఈ పేలుడులో ప్రమాదంలో గాయపడిన వారందరూ పోలీసులేనని అధికార ప్రతినిధి వెల్లడించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా తాత్కాలిక ముఖ్యమంత్రి కేపీకే అర్షద్ హుస్సేన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఉగ్రవాదంపై యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్పై వ్యతిరేకత కారణంగా పాకిస్థాన్లో ఉగ్రవాదులు తరుచూ పోలియో బృందాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ దాడికి బాధ్యులని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే పాకిస్తాన్ తాలిబాన్తో సహా ఇస్లామిక్ తీవ్రవాదులు గతంలో అనేక మంది పోలియో టీకా కార్మికులతో పాటు వారిని రక్షించే పోలీసులపై బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే.
More Stories
కాలిఫోర్నియాలో జడ్జిగా తెలుగు మహిళ బాడిగ జయ
శ్రీలంకలో సీతమ్మ వారి పునః ప్రతిష్ట
చైనా సైనిక చర్య ఆపేయాలన్న తైవాన్