ఆసియా క్రీడల్లో ఒకే రోజు భారత్‍కు 15 పతకాలు

ఆసియా క్రీడల్లో ఒకే రోజు భారత్‍కు 15 పతకాలు
ఆసియా క్రీడలలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. చైనాలో హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకెళుతున్నారు. గేమ్స్ 8వ రోజైన ఆదివారం భారత్ కు మూడు స్వర్ణాలు సహా 15 పతకాలు వచ్చాయి.  దీంతో ఆసియా క్రీడలలో భారత పతకాల సంఖ్య అర్ధ శతకం దాటి 53 (13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలు)కు చేరుకుంది.  ఈసారి ఆసియా క్రీడల్లో 100 పతకాలు సాధించాలన్న భారత్ లక్ష్యం నెరవేరేలా కనిపిస్తుంది. అక్టోబర్ 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.

ఆదివారం భారత్‍కు వచ్చిన పతకాలు

  • షూటింగ్‍ పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‍లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చింది. జోర్వార్ సింగ్, కినన్ డరియస్ చెనై, పృథ్వి రాజ్ తొండిమాన్‍తో కూడిన భారత జట్టు గోల్డ్ గెలిచింది.
  • 3000 మీటర్ల స్టీపుల్‍చేజ్‍లో భారత అథ్లెట్ అవినాశ్ సేబల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
  • షార్ట్ పుట్‍లో ఇండియా అథ్లెట్ తేజిందర్ పాల్ సింగ్ తూర్.. గోల్డ్ మెడల్ సాధించాడు. చివరి త్రోలో 20.36 మీటర్లు విసిరి బంగారు పతకం దక్కించుకున్నాడు.
  • గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్ అదితి అశోక్ రజత (సిల్వర్) పతకం సాధించింది.
  • మహిళల 100 మీటర్ల హర్డుల్స్ విభాగంలో భారత అథ్లెట్, తెలంగాణ అమ్మాయి జ్యోతి ఎర్రాజీ రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
  • బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్‍లో భారత్‍కు వెండి పతకం దక్కింది.
  • పురుషుల లాంగ్ జంప్‍లో భారత అథ్లెట్ శ్రీశంకర్‌ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్‍లో 8 మీటర్లు జంప్ చేసి మెడల్ దక్కించుకున్నాడు.
  • 1500 మీటర్ల మహిళల పరుగులో భారత అథ్లెట్ హర్మిలన్ బైన్స్ వెండి పతకాన్ని సాధించింది.
  • షూటింగ్ మహిళల ట్రాప్ ఈవెంట్‍లో భారత్‍కు రజత పతకం దక్కింది. రాజేశ్వరి కుమారి, మనీశా కీర్, ప్రీతి రజక్‍తో కూడిన ఇండియన్ టీమ్ వెండి మెడల్ దక్కించుకుంది.
  • పురుషుల 1500 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ అజయ్ కుమార్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
  • మహిళల హెప్టథ్లాన్‍లో ఇండియన్ అథ్లెట్, తెలంగాణ అమ్మాయి అగసర నందిని కాంస్య (Bronze) పతకాన్ని కైవసం చేసుకుంది.
  • భారత స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. 50 కేజీల బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీస్‍లో ఓడిన తెలంగాణ బాక్సర్ నిఖత్.. బ్రాంజ్‍తోనే సరిపెట్టుకుంది.
  • మహిళల డిస్కస్ త్రోలో భారత ప్లేయర్ సీమా పునియా కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
  • పురుషుల 1500 మీటర్ల పరుగులో ఇండియన్ అథ్లెట్ జిన్సన్ జాన్సర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
  • షూటింగ్ పురుషుల ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్‍లో భారత షూటర్ కినాన్ డరియుస్ చెనై కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

ఇలా ఆసియా క్రీడల చరిత్రలో భారత్ కు ఒకే రోజు 15 పతకాలు రావడం ఇదే తొలిసారి. 53 పతకాలు గెలుచుకొని మెడల్స్ టేబుల్‍లో నాలుగో స్థానంలో ఉంది. 242 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉంది. 100 పతకాలు గెలువాలన్న లక్ష్యంతో 19వ ఏషియన్ క్రీడల్లోకి భారత్ అడుగుపెట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం చేజార్చుకున్న యంగ్‌ గోల్ఫర్‌ ఆదితి అశోక్‌ ఆసియా క్రీడల్లోఅదరగొట్టింది. మహిళల విభాగంలో నాలుగు రౌండ్ల తర్వాత17- అండర్‌ 271తో రెండో స్థానంలో నిలిచి వెండి పతకం దక్కించుకుంది. తద్వారా ఈ పోటీలో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా అదితి రికార్డు నెలకొల్పింది.

లాంగ్‌ జంప్‌లో మురళీ శ్రీ శంకర్‌ రికార్డులు తిరగరాశాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 8.19 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకం సాధించాడు. దాంతో, 45 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో పతకం గెలిచిన లాంగ్‌ జంపర్‌గా శంకర్‌ సంచలనం సృష్టించాడు.