మణిపూర్‌ హింసాకాండలో 175 మంది మృతి

మణిపూర్‌ హింసాకాండలో 175 మంది మృతి

మణిపూర్‌ హింసాకాండలో ఇప్పటివరకు 175 మంది మరణించగా, 1,108 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.   సుమారు 33 మంది అదృశ్యమైనట్లు  పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై కొన్ని కీలక గణాంకాలను పోలీసులు విడుదల చేశారు.  175 మందిలో ఇప్పటికీ గుర్తించని 96 మృతదేహాలు మార్చురీలో ఉన్నట్లు చెప్పారు.   

మణిపూర్‌లో గత కొన్ని  నెలలుగా హింసాత్మక   పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం ఈ హింసలో కనీసం 5,172 అగ్ని ప్రమాద ఘటనలు జరిగాయి. వాటిలో 4,786 నివాసాలు, 386 మతపరమైన ప్రదేశాలు (254 చర్చిలు, 132 దేవాలయాలు) అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. హింస ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర ఆయుధగారం నుండి 5,668 ఆయుధాలు లూటీకి గురయ్యాయని, వాటిలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని పేర్కొన్నారు. 

అలాగే 15,050 మందుగుండు సామగ్రి, 400 బాంబులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలో కనీసం 360 అక్రమ బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశారు.  బిష్ణుపూర్‌ జిల్లాలోని ఫౌగక్‌చావో ఇఖారు నుండి చురచంద్‌పూర్‌ జిల్లాలోని కాంగ్‌వై వరకు బారికేడ్‌లను తొలగించామని, జాతీయ రహదారులపై భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. 32, 2 నెంబర్ల జాతీయ రహదారులపై రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు 9,332 కేసులు నమోదు కాగా, 325 మందిని అరెస్ట్‌ చేశామని తెలిపారు.

కాగా, కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్‌ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న జాత్యహంకార ఘర్షణలను చల్లార్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ శాంతి నెలకొనడం లేదు కదా రోజురోజుకూ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత క్షీణిస్తున్నాయి. ఇప్పటికీ కొందరు అల్లరి మూకలు, నిషేధిత ఉగ్రవాదులు అక్కడక్కడా దాడులకు పాల్పడుతున్నారు.