
వలస పాలన నాటి రాజద్రోహం (ఐపీసీ 124 ఏ సెక్షన్) (సెడిషన్) రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. కనీసం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను విచారిస్తుందని తెలిపింది.
ప్రస్తుతం శిక్షాస్మృతి నిబంధనల్లో మార్పులు చేర్పులు చేపడుతున్న నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయడాన్ని వాయిదా వేయాలన్న కేంద్రం అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్లో కేసును ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ద్వారా కేసును విచారించేందుకు వీలుగా పత్రాలను అందుబాటులో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపింది.
భారత శిక్షాస్మృతిని పునఃపరిశీలించడంపై సంప్రదింపులు కీలక దశలో ఉన్నాయని కేంద్రం చెప్పడంతో మే 1న ఈ పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమం లోనే ఆగస్టు 11న ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా లోక్సభలో మూడు బిల్లులను ప్రవేశ పెట్టారు.
రాజద్రోహ సెక్షన్ను పూర్తిగా రద్దు చేస్తూ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఆయా పిటిషన్లు మంగళవారం విచారణకు రాగా కేంద్రం కొత్త చట్టం ప్రతిపాదించిన నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోరారు. కొత్త ప్రతిపాదిత చట్టాలను ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్నదని తెలిపారు.
అయితే, కొత్త చట్టం వచ్చినా అది భవిష్యత్తులో జరిగే కేసులపైనే ప్రభావం చూపుతుందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. సెక్షన్ 124ఏ చెల్లుబాటు అవుతుందా? అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంటూ ఎందుకంటే ఇది పెండింగ్లో ఉన్న కేసులను సైతం ప్రభావితం చేస్తుందని తెలిపారు. దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతపై తీర్పు చెప్పకుండా ఉండలేమని, ఎందుకంటే కొత్త చట్టం దాని ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుందని, అప్పుడు ఇప్పటికే ఉన్న ప్రాసిక్యూషన్ మిగిలే ఉంటుందని సీజేఐ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, రాజద్రోహం సెక్షన్ను సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ 16 నెలల క్రితమే నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీసీలోని సెక్షన్ 124 ఎ కింద ఎలాంటి కేసులూ నమోదు చేయొద్దని, వలస పాలకులు తెచ్చిన ఆ చట్టాన్ని సమీక్షించాలని ఆయన గత ఏడాది మే 11న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు