మణిపూర్‌లో ముగ్గురు గిరిజనుల కాల్చివేత

మణిపూర్‌లో ముగ్గురు గిరిజనుల కాల్చివేత
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మరోసారి అక్కడ హింస చెలరేగింది.  కంగ్‌పోక్పీ జిల్లాలోని మంగళవారం ఉదయం ముగ్గురు కుకీ-జో తెగకు చెందిన ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. కంగ్వి ప్రాంతంలోని ఇరెంగ్, కరమ వీఫీ గ్రామాల మధ్య ఈ మెరుపుదాడి జరిగినట్లు అధికారి ఒకరు తెలిపారు.

ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తమకు తెలిసిందని, గుర్తు తెలియని సాయుధులు కొందరు ముగ్గురు పౌరులను కాల్చి చంపివేసినట్లు తమకు సమాచారం అందిందని ఆ అధికారి తెలిపారు. ఈ నెల 8వ తేదీన టెంగ్‌నౌపాల్ జిల్లాలోని పల్లెల్ వద్ద హింసాకాండ చెలరేగి ముగ్గురు వ్యక్తులు మరణించగా 50 మందికి పైగా గాయపడిన ఘటనల నేపథ్యంలో తాజా ఘటన జరిగింది.

మరోవైపు మణిపూర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలు యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తిరిగి క్రియాశీలం అవుతున్నాయని, లెఫ్టినెంట్‌ కర్నల్‌పై కాల్పుల ఘటన వెనుకున్నది ఈ సంస్థలేనని నిఘావర్గాలు వెల్లడించాయి. నిరసనకు దిగుతున్న గుంపులోకి ఉగ్రవాద సంస్థల సభ్యులు చొరబడుతున్నారని కేంద్ర భద్రతా బలగాలు భావిస్తున్నాయి. 

గతవారం టెంగ్నోపాల్‌ జిల్లాలోని ఓ గ్రామం వద్ద కొంతమంది ఆందోళన చేపట్టగా ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ అడ్డుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారి కాల్పులు చోటుచేసుకోగా లెఫ్టినెంట్‌ కర్నల్‌ రామన్‌ త్యాగీకి బుల్లెట్‌ గాయమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన కేంద్ర భద్రతా బలగాలు గుంపుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల సభ్యులు చేరుతున్నారని నిర్ధారించాయి.