నూతన పార్లమెంట్‌లో ఉద్యోగులకు కొత్త యూనిఫామ్

కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనంలో త్వరలో సమావేశాలు నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కొత్త భవనంలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్న వేళ ఉద్యోగుల డ్రెస్‌ కోడ్‌ మార్చినట్లు తెలుస్తోంది. హౌస్ ఉద్యోగుల కోసం కొత్త యూనిఫామ్‌ను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఉద్యోగుల కొత్త వేషధారణ భారతీయ స్ఫూర్తితో ఉంటుందని పేర్కొన్నాయి. వారిచ్చిన సమాచారం మేరకు పార్లమెంట్ హౌస్‌లో ఉన్న మార్షల్స్ సఫారీ సూట్‌లకు బదులుగా క్రీమ్ కలర్ కుర్తాలు, పైజామా ధరిస్తారని తెలిసింది. దీంతోపాటు పీజీడీ (పార్లమెంటరీ గార్డ్ డైరెక్టరేట్) డ్రెస్‌లో కూడా మార్పు ఉంటుంది. 

అలాగే మహిళా ఉద్యోగులు కొత్త డిజైన్ చీరలు ధరిస్తారు. సెక్రటేరియట్ ఉద్యోగులు క్లోజ్డ్ నెక్ సూట్ స్థానంలో మెజెంటా లేదా డార్క్ పింక్ నెహ్రూ జాకెట్ ఉంటుంది. పార్లమెంట్ హౌస్‌లోని పురుష ఉద్యోగుల చొక్కాలు ముదురు గులాబీ రంగులో ఉంటాయి. వాటిపై తామర పువ్వు ఉంటుంది. ఆ చొక్కాకు అనుసంధంగా వారు ఖాకీ ప్యాంట్‌ ధరించనున్నారు.

దీంతోపాటు ఉభయ సభల్లోని మార్షల్స్ మణిపురి తలపాగాలు ధరిస్తారు. పార్లమెంట్ భవనంలో భద్రతా సిబ్బంది వేషధారణ కూడా మారబోతోంది. సఫారీ సూట్‌లకు బదులుగా మిలటరీ తరహా దుస్తులు ధరించనున్నారు. ఉద్యోగుల కొత్త యూనిఫామ్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) రూపొందించింది.

సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదురోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 18వ తేదీన పాత భవనంలో సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 19 నుంచి ఈ సమావేశాలు కొత్త భవనంలో కొనసాగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

గణేశ్‌ చతుర్థి సందర్భంగా కొత్త భవనంలో పూజ నిర్వహించిన తర్వాత సమావేశాలను కొనసాగించనున్నారు. అయితే, ప్రత్యేక సమావేశాల అజెండాను ప్రభుత్వం ఇంకా ప్రకటించవలసి ఉంది.