మాదక ద్రవ్యాల ముప్పు సమూలంగా నిర్మూలన

మాదక ద్రవ్యాల ముప్పు సమూలంగా నిర్మూలన

దేశం నుంచి మాదక ద్రవ్యాల ముప్పును మోదీ ప్రభుత్వం సమూలంగా నిర్మూలిస్తుందని, దేశం మీదుగా వీటి రవాణా కానీయకుండా చూస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినం సందర్భంగా వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదనే విధానాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుసరిస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వంలోని వివిధ విభాగాల సమన్వయంతో మోదీ ప్రభుత్వ మొత్తం చొరవతో మాదక ద్రవ్యాల వాణిజ్యానికి వ్యతిరేకంగా ప్రాథమికంగా విజయం సాధించడమైందని పేర్కొన్నారు. 2006 నుంచి 2013 మధ్యకాలంలో రూ.768 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకోగా, 2014 నుంచి 2022 మధ్య కాలంలో రూ. 22,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకోవడమైందని, అంతకు ముందు కన్నా ఇది 30 రెట్లు ఎక్కువని అమిత్ షా వివరించారు.

 అలాగే 2006 నుంచి 2013 మధ్యకాలంలో డ్రగ్ రవాణాదారులపై 1257 కేసులు నమోదు కాగా, 2014 2022 మధ్యకాలంలో 3544 కేసులు నమోదై కేసుల సంఖ్య 181 శాతం పెరిగిందని, ఇంతే కాకుండా 2022 జూన్ నుంచి 6 లక్షల కిలోగ్రాముల డ్రగ్స్ ధ్వంసం చేయడమైందని వివరించారు.

దేశాన్ని డ్రగ్స్ విముక్తి భారత్‌గా చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉండడాన్ని ఇది తెలియజేస్తుందని తెలిపారు. అయితే, ప్రజల సహకారం లేనిదే మాదక ద్రవ్యాలపై యుద్ధంలో విజయం సాధించలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రచారోద్యమాన్ని మరింత పటిష్టం చేయడానికి హోం మంత్రిత్వ శాఖ 2019లో నేషనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్ ను నెలకొల్పిందని, ప్రతి రాష్ట్రంలో పోలీస్ విభాగంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడమైందని అమిత్ షా వివరించారు.

16,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినం సందర్భంగా ఢిల్లీ పోలీస్‌లు 16,000 కిలోల మాదక ద్రవ్యాలను,మానసిక వ్యతిరేక ప్రభావం చూపించే పదార్థాలను పట్టుకుని ధ్వంసం చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ , స్పెషల్ సెల్ ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నారు.  ఢిల్లీ జిటికె రోడ్డు లోని ఆర్ యు నగర్ పారిశ్రామిక ప్రాంతంలో బయోటిక్ వేస్ట్ సల్యూషన్స్ ప్రైవేట్ సంస్థ వద్ద చేపట్టిన ఈ విధ్వంస కార్యక్రమాన్ని లెఫ్టెనెంట్ గవర్నర్ సక్సేనా ప్రారంభించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా, సిటీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.