పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో భాగమే

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో భాగంగానే ఉంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పీఓకేను పదే పదే పాకిస్థాన్ క్లెయిమ్ చేయడం వల్ల వారు సాధించేదేమీ లేదని హితవు చెప్పారు. జమ్మూలో సోమవారంనాడు జరిగిన సెక్యూరిటీ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ, పీఓకే భారత్‌ అంతర్భాగమని పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు. ఈ దిశగా కనీసం మూడు ప్రతిపాదనలు పార్లమెంటు ఆమోదం పొందాయని గుర్తు చేసారు.

జమ్మూకశ్మీర్‌లోని ఎక్కువ భాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉందని, అక్కడి ప్రజలు ప్రశాంత జీవనం కోసం భారత్ వైపు చూస్తున్నారని చెబుతూ  పాకిస్థాన్ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. పీఓకేను పాక్ ఆక్రమించుకోవడం ఎంతమాత్రం చెల్లుబాటు కాదని ఆయన హెచ్చరించారు.

దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న జమ్మూకశ్మీర్ ప్రజలకు న్యాయం చేసేందుకే 370వ అధికరణను రద్దు చేశామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆర్టికల్ 370, 35ఏ కారణంగా జమ్మూకశ్మీర్ ప్రజలు చాలాకాలంగా దేశ జనజీవన స్రవంతిలో కలవలేకపోయారని, దేశవ్యతిరేక శక్తులపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఈ అధికరణలు అవరోధంగా నిలిచాయని ఆయన వివరించారు.

370వ అధికరణ రద్దుతో సామాన్య ప్రజానీకం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే,  విద్వేషం, వేర్పాటువాద దుకాణాలు మూతపడటం గిట్టనివారికే ఇది సమస్యగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే నిధులు అందకుండా చేశామని, ఉగ్రవాదులను ఏరివేస్తూ, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిలిపివేశామని చెప్పారు.

స్థానికంగా ఉగ్రవాద కార్యలాపాలకు ఊతమిస్తున్న నెట్‌వర్క్‌ను దెబ్బతీశామని తెలిపారు. ఉగ్రవాదంపై అమెరికాతో సహా ప్రపంచ దేశాల ఆలోచనా ధోరణిలో భారత్ మార్పు తీసుకువచ్చిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్త ప్రకటన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసిందని రాజ్‌నాథ్ చెప్పారు.

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాలు ఇంక ఎంతోకాలం తమ ఆటలు చెల్లవని గ్రహిస్తున్నారని, ఇవాళ ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉన్నాయని చెప్పారు.

కాగా, పొరుగుదైశమైన చైనాతో అనేక సార్లు అనేక అంశాలపై విభేదాలు వచ్చాయని, చైనాతో సరిహద్దు విషయంలో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఇరుదేశాల సైన్యం సరిహద్దుల్లో ప్రోటోకాల్స్ పాటిస్తున్నాయని చెప్పారు. అంగీకరించిన ప్రోటోకాల్స్‌ను అలక్ష్యం చేయడం వల్లనే 2020లో ఈస్ట్ లడఖ్ వివాదం తలెత్తిందని చెప్పారు.

ఎల్ఏసీపై కొన్ని మార్పులను చేయడానికి చైనా ఆర్మీ పీఎల్ఏ ఏకపక్షంగా ప్రయత్నించడంతో భారత బలగాలు సమర్ధవంతంగా ప్రతిఘటించాయని రక్షణ మంత్రి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్నామని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని ప్రపంచదేశాలు సైతం తొలిసారి గ్రహించాయని చెప్పారు.

ఈశాన్య భారతంలో తిరుగుబాటు సమస్యను విజయవంతంగా అదుపు చేశామని, దాంతో అక్కడి చాలా ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్‌పీఏ చట్టాన్ని తొలగించామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాశ్వాత శాంతి కోసం ఎదురుచూస్తు్న్నామని, అక్కడ కూడా ఏఎఫ్ఎస్‌పీఏను తొలగించే అవకాశాలున్నాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.