మణిపుర్ ప్రశాంతం … హింసాకాండలో 54 మంది మృతి!

మణిపుర్ ప్రశాంతం … హింసాకాండలో 54 మంది మృతి!
* ఐదుగురు పర్వత ప్రాంత ఉగ్రవాదులు కాల్చివేత

మణిపుర్ హింసాకాండలో మరణించిన వారి సంఖ్య 54కి పెరిగింది. కాగా అనధికారికంగా అయితే ఇది మరింత సంఖ్యలో ఉండగలదని అధికారులు తెలిపారు. అయితే, ఇంఫాల్ లోయలో శనివారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దుకాణాలు, మార్కెట్లు తెరుచుకున్నాయి. రోడ్లపై వాహనాలు తిరిగి నడవడం ప్రారంభించాయి.

మరిన్నీ సైనిక దళాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర పోలీసు బలగాలతో భద్రతను అన్ని ప్రాంతాల్లో పెంచారు. భద్రత ఏర్పాట్లు ప్రధాన రోడ్లపై స్పష్టంగా కనిపించింది. ప్రజలు కూరగారలు వగైరా కొనడం కనిపించింది.

చనిపోయిన 54 మందిలో 16 మృతదేహాలను చురచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చూరీలో ఉంచగా, 15 మృత దేహాలు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంఫెల్‌లోని రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 23 మంది ఉన్నల్టు ప్రకటించినట్లు తెలిపిందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు కొండ ప్రాంత ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. చురచంద్‌పూర్‌లోని సైటన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

చురచంద్‌పూర్, మోరే, కక్చింగ్, కాంగ్‌పోక్పీ జిల్లాలను సైన్యం తన నియంత్రణలోకి తీసుకోవడంతో మొత్తం 13,000 మందిని రక్షించి సురక్షిత ఆశ్రయాలకు తరలించామని, కొంత మంది సైనిక శిబిరాల్లో ఉన్నారని రక్షణ ప్రతినిధి తెలిపారు. గత రాత్రి ఎలాంటి పెద్ద హింసాత్మక ఘటన జరగలేదని అధికారులు తెలిపారు.

మణిపుర్‌లో ప్రస్తుతం 10,000 మంది సైనికులను మోహరించారు. మణిపుర్‌లో బుధవారం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. హోంమంత్రి అమిత్ షా శుక్రవారం మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్, ఇతర ప్రముఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మణిపుర్‌లో శాంతిని కాపాడడానికి కేంద్రం అదనపు భద్రతా బలగాలను, యాంటీరాయిట్ వెహికిల్స్‌ను అక్కడికి తరలించింది.