కోట్లాది మంది భారతీయుల మనసులో మాటే  ‘మన్ కీ బాత్’

కోట్లాది మంది భారతీయుల మనసులో మాటే  ‘మన్ కీ బాత్’
కోట్లాది మంది భారతీయుల మనసులో మాటే తన ‘మన్​ కీ బాత్​’ అని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజల మనోభావాలకు ప్రతిరూపమే ఈ రేడియో కార్యక్రమం అని చెబుతూ సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్  కార్యక్రమం వేదికైందని చెప్పారు.
 
ప్రధాని వేలాది మంది ప్రజల నుంచి తనకు ఉత్తరాలు అందాయని, వాటిని చదువుతుంటే తీవ్ర భావోద్వేగం కలిగిందని తెలిపారు. ఆకాశవాణిలో ఆదివారం ఉదయం 11 గంటలకు.. మన్​ కీ బాత్​ కార్యక్రమానికి చెందిన 100వ ఎపిసోడ్​ ప్రసారమైంది. ఈ నేపథ్యంలో ఈ రేడియో కార్యక్రమం విజయవంతం కావడంపై ప్రధాని మాట్లాడారు.

“ఇది మన్​ కీ బాత్​ 100వ ఎపిసోడ్​. మన్​ కీ బాత్​ 100 ఎపిసోడ్​ నేపథ్యంలో మీరు, లక్షలాది మెసేజ్​లు వచ్చాయి. వాటన్నింటినీ చదివేందుకు నేను ప్రయత్నించాను. అనేక సందర్భాల్లో.. మీ ఉత్తరాలు చదువుతూ నేను భావోద్వేగానికి లోనయ్యాను. మన్​ కీ బాత్​ 100 ఎపిసోడ్​ నేపథ్యంలో మీరు నాకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఇది నా ఒక్కడిది కాదు. మన్​ కీ బాత్​ వినే దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలపాల్సిన సమయం ఇది. మన్​ కీ బాత్​ అనేది.. కోట్లాది మంది భారతీయుల మనసులో మాట,” అని మోదీ పేర్కొన్నారు.

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో తన మనసులోని అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. 2014 అక్బోబర్ 3న చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగ రోజున తొలి మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రారంభమైందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

మన్ కీ బాత్‌లోని ప్రతీ ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలిచిందన్న ప్రధాని ప్రజలు పాల్గొనడం ద్వారా దీన్ని పాజిటివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారని తెలిపారు. భేటీ బచావో భేటీ పడావో, ఖాదీ, స్వచ్చ భారత్, అమృత్ సరోవర్ వంటి ఎన్నో అంశాలను మన్ కీ బాత్‌లో చర్చించామనీ… ప్రజలంతా పాల్గొనడం ద్వారా ఇదో ప్రజా ఉద్యమంలా మారింది ప్రధాని చెప్పారు.

మన్ కీ బాత్.. ఓ పండుగలా మారిందన్న ప్రధాని మోదీ ప్రతీ నెలా ఆ ఎపిసోడ్ కోసం మనమంతా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. మన్ కీ బాత్ అనేది కార్యక్రమం మాత్రమే కాదన్న మోదీ అది తనకు వ్రతం లాంటిదని చెప్పారు. ప్రజలు, ప్రజాదరణ… దేవుడి ప్రసాదం లాంటివి పేర్కొంటూ మన్ కీ బాత్‌లో చర్చించడంతో.. కూతురితో సెల్ఫీ ప్రచారం.. ప్రపంచ గుర్తింపు పొందిందని తెలిపారు.

ఈ 100 ఎపిసోడ్ ద్వారా గత స్మృతులను మోదీ గుర్తు చేస్తూకొంటూ  సీఎంగా ఉన్నప్పుడు తాను నిత్యం ప్రజలను కలిసేవాడినన్న ప్రధాని ఢిల్లీ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. తనకు చాలాసార్లు ఒంటరినని అనిపించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో  దగ్గరగా ఉన్న అనుభూతి తనకు కలుగుతుందని చెప్పారు.

ఇతరులలో ఉన్న మంచి లక్షణాలను ఆరాధించడమే ‘మన్ కీ బాత్’  అని తాను భావిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘మిత్రులారా, నా దృష్టిలో ‘మన్ కీ బాత్’ అంటే ఇతరులలోని మంచి లక్షణాలను ఆరాధించడమే. నాకు ఓ మార్గదర్శి ఉన్నారు. ఆయన పేరు లక్ష్మణరావు ఇనామ్‌దార్. మేం ఆయనను వకీల్ సాహెబ్ అని పిలిచేవారం. ఇతరులలోని మంచి లక్షణాలను మనం ఆరాధించాలని ఆయన మాకు చెప్తూ ఉండేవారు” అని గుర్తు చేసుకున్నారు.

“మీ సమక్షంలో ఎవరు ఉన్నా సరే, వారు మీ అనుకూలురైనా, ప్రత్యర్థులైనా సరే, వారిలోని మంచి లక్షణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆయనలోని ఈ లక్షణం నన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తోంది. ఇతరుల మంచి లక్షణాల నుంచి నేర్చుకునే గొప్ప మాధ్యమంగా మన్ కీ బాత్ మారింది’’ అని మోదీ చెప్పారు.

పర్యాటక రంగంపై ప్రస్తావించిన ప్రధాని మోదీ ఈ రంగం దేశంలో వేగంగా పెరుగుతోందని చెప్పారు. మనకు సహజ వనరులు, నదులు, పర్వతాలు, చెరువులు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయన్న మోదీ వాటిని పరిశుభ్రంగా ఉంచడం ముఖ్యం అని సూచించారు. తద్వారా పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుంది చెప్పారు.

ఈ ఎపిసోడ్‌లో యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజౌలే ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. భారత్ లో విద్య, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆమె ప్రధాని మోదీని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అక్టోబరు 3, 2014న ప్రారంభమైన ఈ కార్యక్రమం భారత్ లో  22 ప్రముఖ భాషలు, 29 మాండలికాలతో పాటూ, మన్ కీ బాత్  ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దరి, స్వాహిలితో సహా 11 విదేశీ భాషలలో కూడా ప్రసారం అవుతుంది. ఆల్ ఇండియా రేడియోకు చెందిన 500కి పైగా ప్రసార కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ ప్రసారమవుతోంది.