గిన్నీస్‌ రికార్డుల్లో బిహూ నృత్యం

గిన్నీస్‌ రికార్డుల్లో బిహూ నృత్యం
ఈశాన్య రాష్ట్రం అస్సాం సంప్రదాయ నృత్యమైన బిహూ డ్యాన్స్‌  గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు.
 
 గువాహటిలోని  సరుసజై స్టేడియంలో  జరిగి ఈ కార్యక్రమంలో సంప్రాదాయ వాయిద్యాలైన ధోల్‌, తాల్‌, గోగోనా, టోకా, పెపా వంటివాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
 
మాస్టర్‌ ట్రైనర్లు, డ్యాన్సర్లతోసహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి రూ.25 వేలు ప్రభుత్వం గ్రాంట్‌గా ఇవ్వనుంది.  ఒకే వేదికపై అతిపెద్ద బిహు నృత్య ప్రదర్శనను నిర్వహించడం, జానపద-నృత్యం విభాగంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చేరడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
 
కాగా, ఇదే వేదికపై డ్రమ్మర్లు మరో రికార్డును నెలకొల్పారు. బిహు నృత్యం కార్యక్రమం అనంతరం.. అదే స్టేడియంలో 2548 మంది డ్రమ్స్‌ వాయించారు. ఒకే చోట ఇంతపెద్ద సంఖ్యలో డమ్మర్లు ప్రదర్శన ఇచ్చి గిన్నిస్‌ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.