ప్రపంచ కప్ కు రూ 500 కోట్లతో స్టేడియంల అభివృద్ధి

ప్రపంచ కప్ కు రూ 500 కోట్లతో స్టేడియంల అభివృద్ధి
ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్‌లిస్ట్‌ కూడా చేసింది. అహ్మదాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్‌కతా, లక్నో, ఇండోర్‌, రాజ్‌కోట్‌, హైదరాబాద్‌, ముంబైలు ఈ లిస్టులో ఉన్నాయి.
 
అయితే వీటిలో కొన్ని స్టేడియంలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న న నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో జరగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని ఐదు  స్టేడియాలను అభివృద్ధిచేసేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది.
 
బీసీసీఐ ఢిల్లీతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపరచనుంది. ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియానికి కొత్త రూపు తీసుకురావడానికి బడ్డెట్‌లో నిధులు కేటాయించింది. స్టేడియంలో వసతులు మెరుగుపరచడానికి రూ.117.17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. సీటింగ్‌ సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నారు.
 
ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే కోసం రూ.78.82 కోట్లు ఖర్చు కానుంది. ఒకవేళ ఈ స్టేడియాల్లో రూఫ్‌ పనులు కూడా చేస్తే ఈ ఖర్చు మరింత పెరగనుంది.  2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు వేదికైన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో కనీస వసతులు లేవని ఓ అభిమాని ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా వన్డేకు ముందు ఆ స్టేడియాన్ని రెనోవేట్‌ చేశారు.