మొఘల్స్ ఇక సీబీఎస్ఈ పుస్తకాల్లో కనిపించరు

మొఘల్స్ ఇక సీబీఎస్ఈ పుస్తకాల్లో కనిపించరు
మొఘల్​ చక్రవర్తుల చరిత్రకు  సంబంధించిన పాఠాలు ఇక సీబీఎస్​ఈ 12వ తరగతి, యూపీ బోర్డు సిలబస్​లలో కనిపించవు! ఈ మేరకు చరిత్రకు సంబంధించిన పాఠ్యంశాలను సవరిస్తూ కేంద్ర- రాష్ట్ర విద్యా సంస్థల అడ్వైజరీ ఎన్​సీఈఆర్​టీ నిర్ణయం తీసుకుంది. ఎన్​సీఈఆర్​టీ తాజా నిర్ణయంతో ‘కింగ్స్​ అండ్​ క్రానికల్స్​’, ‘ది మొఘల్​ కోర్ట్​’ వంటి అధ్యాయా​లు ఇకపై సీబీఎస్​ఈ 12వ తరగతి మధ్యకాలం చరిత్ర పాఠ్యపుస్తకాలలో  ఉండవు. ఈ మార్పు దేశవాప్తంగా ఎన్సీఈఆర్టీని అనుసరించే అన్ని స్కూల్స్‌కు వర్తించనున్నది.

మరోవైపు ఎన్​సీఈఆర్​టీ 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాలను అనుసరించాలని  ఉత్తర్​ ప్రదేశ్​ ఎడ్జ్యుకేషన్​ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మొఘల్స్​ చరిత్రకు సంబంధించిన పాఠాలు ఇక ఉండవు. “మా విద్యార్థులకు ఎన్​సీఈఆర్​టీ పుస్తకాలు చూసి చదువు చెబుతాము. అందులో ఏముంటే అదే చెప్పాలి కదా,” అని ఉత్తర్​ ప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి బ్రజేష్​ పాఠక్​ మీడియాకు వివరించారు.

థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ పార్ట్‌-2లో ఉన్న ‘కింగ్‌ అండ్‌ క్రానికల్స్‌: ది మొఘల్‌ కోర్ట్స్‌ (సీ.16,17వ శతాబ్దాలు) చాప్టర్లను పూర్తిగా తొలగించింది. హిస్టరీతోపాటు హిందీ, సివిక్స్‌ పుస్తకాల్లోనూ మార్పులు చేసింది. 10, 11వ తరగతి పుస్తకాల్లోనూ పలు పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది. ఈ మార్పులు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమలవుతాయని ఎన్సీఈఆర్టీ పేర్కొన్నది.

సీబీఎస్​ఈ 12వ తరగతి పొలిటికల్​ సైన్స్​ సిలబస్​లో దేశంలో సోషలిస్ట్​, కమ్యూనిస్ట్​ పార్టీలకు సంబంధించిన ‘రైజ్​ ఆఫ్​ పాప్యులర్​ మూమెంట్స్​’, స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్​ పాలనకు చెందిన ‘ఎరా ఆఫ్​ వన్​ పార్టీ డామినెన్స్​’ వంటి అధ్యాయాలను తొలగించారు. కాగా, పౌరశాస్త్రము పాఠ్యపుస్తకంలో `అంతర్జాతీయ రాజకీయాలపై అమెరికా ఆధిపత్యం’, `ప్రచ్ఛన్నయుద్ధం కాలం’ అధ్యాయాలను కూడా తొలగించారు. 

10, 11వ తరగతుల సిలబస్​లలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ‘డెమొక్రసీ అండ్​  డైవర్సిటీ’, ‘పాప్యులర్​ స్ట్రగుల్స్​ అండ్​ మూవ్​మెంట్స్​’ వంటి పాఠాలను 10వ తరగతి  పొలిటికల్​ సైన్స్​ సిలబస్​ నుంచి తప్పించారు. ‘సెంట్రల్ ​ ఇస్లామిక్​ ల్యాండ్స్​’, ‘కాన్​ఫ్రెంట్రేషన్​ ఆఫ్​ కల్చర్స్​’ వంటి పాఠాలను సీబీఎస్​ఈ  11వ తరగతి చరిత్ర పుస్తకాల నుంచి తొలగించారు. 

ఇలా ఉండగా, రెండేళ్ల క్రితం దేవాలయాలకు నిధులు సమకూర్చారని అంటూ ముఘల్ రాజులను, ముఖ్యంగా ఔరంగాబాద్, షాజహాన్ లను పొగుడుతూ పాఠ్యపుస్తకాలలో పేర్కొనడాన్ని గురించి సమాచార హక్కు చట్టం క్రింద వివరాలు కోరగా, తమ వద్ద అందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఎన్​సీఈఆర్​టీ సమాధానం ఇచ్చింది.

మనదేశంలో భారత దేశంపై దండయాత్రలు చేరి, ఇక్కడ సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకొని, మన సంపదను దోచుకున్న ముస్లిం దురాక్రమణదారుల గురించి సానుభూతి కలిగించే విధంగా కల్పిత చరిత్రను వామపక్ష మేధావులు/చరిత్రకారులు, నెహ్రు వారసులు ప్రచారం చేశారనే విమర్శలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి.
బాబర్ నుండి ఔరంగజేబు వరకు హిందువులను అణచివేతకు గురిచేశారని, మారణకాండ సాగించారని, మహిళలపై అత్యాచారాలకు పాలపడ్డారని, హిందూ మహిళలను బలవంతంగా లైంగిక బానిసలుగా మార్చుకున్నారని, అసంఖ్యాకమైన హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులను నిర్మించుకున్నారని స్పష్టమైన అసంఖ్యాక ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని మన చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఎక్కడా పేర్కొనకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. ఈ చరిత్ర వక్రీకరణకు పాఠ్యపుస్తకాలలో ముగింపు పలికే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది.