రాబోయే 90 రోజులు దేశవ్యాప్తంగా అధికంగా ఉష్ణోగ్రతలు

రాబోయే 90 రోజులు దేశవ్యాప్తంగా అధికంగా ఉష్ణోగ్రతలు

రాబోయే 90 రోజులు.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది. మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని ప్రాంతాల్లో వేడిగాలులు ఉంటాయని హెచ్చరికలను జారీ చేసింది. వాయ‌వ్యం, ద్వీప ప్రాంతాల‌ను మిన‌హాయించి ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా స‌గ‌టు సాధార‌ణం క‌న్నా ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్న‌ట్లు  తెలిపింది.

ప్రస్తుతం దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే  ఇవన్నీ ఏప్రిల్ పదో తేదీ వరకు మాత్రమే కురుస్తాయని, ఆ తర్వాత ఎండలు బాగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌లో దేశ‌వ్యాప్తంగా వ‌ర్షాలు సాధార‌ణ స్థాయిలో ఉంటాయ‌ని, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం క‌న్నా త‌క్కువ స్థాయిలో వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయని వివరించారు. .

బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని, వేడి గాలులతో జనం ఇబ్బందులు పడతారని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. 

తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుందని, కొన్ని ప్రాంతాల్లో 48, 49 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే అమ్మో ఎండలు అంటున్నారు. ఇక రాబోయే 90 రోజులు ఉక్కబోత తప్పదు.