సుప్రీంకోర్టు జడ్జిగా దీపాంకర్‌ దత్తా ప్రమాణం

సుప్రీంకోర్టు జడ్జిగా దీపాంకర్‌ దత్తా ప్రమాణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలోని ఒకటో నంబర్‌ కోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్‌ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు.  దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. మరో ఆరు జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంలో సీజేఐతో సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34.
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ దత్తాను  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని అప్పటి సీజేఐ యూయూ లలిత్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది సెప్టెంబర్‌ 26న సిఫారసు చేసింది. దీనికి కేంద్ర న్యాయశాఖ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో 2030, ఫిబ్రవరి 8 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా 1965, ఫిబ్రవరి 9న జన్మించారు. ఆయన తండ్రి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ సలీల్‌ కుమార్‌ దత్తా. 2006, జూన్‌ 22న సలీల్‌ దత్తా పదవీ విరమణ చేశారు. 2020 ఏప్రిల్ 28న ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన దీపాంకర్ దత్తా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అమితవ్ రాయ్ కు బావమరిది.