అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జీ20 దేశాల కూటమికి ఇక భారత్ నేతృత్వం వహించనుంది. బుధవారం ఇండోనేషియాలోని బాలి నగరం వేదికగా ఇందుకు సంబంధించిన కీలక ఘట్టం చోటుచేసుకుంది. జీ20 సదస్సు రెండో రోజు సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వీకరించారు.
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలను నరేంద్ర మోదీ స్వీకరించారు. ఏడాది పాటు (డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 20 దాకా) భారత్ జీ20 అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. వచ్చే ఏడాది భారత్ లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.
బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా బుధవారం సభ్య దేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోడీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. జీ20 అధ్యక్ష బాధ్యతలు ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.
వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తామని కూడా ప్రధాని చెప్పుకొచ్చారు. పర్యావరణం, ఆర్ధిక రంగం సహా అనేక అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు సంభవిస్తోన్న తరుణంలో శక్తిమంతమైన జీ20 కూటమి అధ్యక్షత బాధ్యతలు భారత్కు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతకుముందు జీ20 సదస్సులో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాన చర్చ జరిగింది. ఐరోపా దేశం పోలాండ్ లో జరిగిన మిస్సైల్ దాడిలో ఇద్దరు మృతి చెందిన ఘటనపైనా చర్చ జరిగింది. మిస్సైల్ దాడి చేసింది రష్యానే అని.. ఆ మిస్సైల్ రష్యాలో తయారైందేనని పోలాండ్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కేంద్రంగా ఈ చర్చ సాగింది.
మరోవైపు జీ20 వేదికగా వివిధ దేశాల అధినేతలతోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. మోదీ కలిసిన దేశాధినేతల జాబితాలో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ కూడా ఉన్నారు. గల్వాన్ లోయ ఘటనతో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆ ఘటన తర్వాత భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈసారి జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరయ్యారు.
More Stories
ఉక్రెయిన్లో నాలుగు పవర్ ప్లాంట్లు ధ్వంసం
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్