గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఏకంగా 10 సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత మోహన్ సింహ్ రాథ్వా (78) పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్ కు పంపించారు.
వెంటనే ఆయన బీజేపీలో చేరారు. అహ్మదాబాద్లో బీజేపీ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భార్గవ్ భట్, ప్రదీప్సింహ్ వాఘేలా సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ లోని ఛోటా ఉదయ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి మోహన్ సింహ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాష్ట్రంలోని గిరిజన వర్గంలో మోహన్ సింహ్ కు మంచి పేరుంది. ఈసారి జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయనని, కొడుకు రాజేంద్ర సింహ్ రాథ్వా ను తన స్థానంలో నిలబెడతానని ఇటీవల మోహన్ సింహ్ ప్రకటించారు.
ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. కుమారుడు రాజేంద్రకు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినందు వల్లే మోహన్ సింహ్ రాజీనామా చేశారని తెలుస్తున్నది. ‘‘ గిరిజన ప్రాంతాల్లో మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నా’’ అని మోహన్ సింహ్ స్పష్టం చేశారు.
తనకు సీట్ ఇవ్వనని కాంగ్రెస్ చెప్పలేదని, తానే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆయనతో పాటు ఆయన కొడుకులిద్దరూ రాజేంద్ర సింహ్, రంజిత్ సింహ్ కూడా బిజెపిలో చేరారు.
More Stories
పాక్ వద్ద అణుబాంబు… గౌరవించాల్సిందే… ఓ కాంగ్రెస్ నేత!
ఎన్డీయేలో చేరమని పవార్, ఠాక్రేలకు మోదీ ఆహ్వానం
అర్వింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్