విజయవంతంగా అగ్ని క్షిపణి పాటవ పరీక్ష

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన, అణు సామర్ధ్యం గల మధ్యశ్రేణి విధ్వంసక క్షిపణి అగ్ని ప్రైమ్ పాటవ పరీక్షను శుక్రవారం ఒడిశా తీరం నుంచి డిఆర్‌డిఓ విజయవంతంగా నిర్వహించింది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో అబ్దుల్ కలామ్ దీవి నుంచి మొబైల్ లాంఛర్ ద్వారా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డిఆర్‌డిఓ వర్గాలు తెలిపాయి. 
 
ఘన ఇంధనంతో నడిచే ఈ క్షిపణి పాటవ పరీక్షలో అన్ని అంశాలలో విజయవంతం అయినట్లు వారు చెప్పారు. వివిధ పాయింట్ల వద్ద అమర్చిన రాడార్లు, టెలిమెట్రి పరికరాలలో క్షిపణి గమనం రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు.  పరీక్ష లక్ష్యాలన్నిటినీ అత్యంత కచ్చితత్వంతో ఇది ఛేదించింది.
వరుసగా మూడోసారి నిర్వహించిన ఈ పరీక్షలు ఈ వ్యవస్థ కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను నిరూపించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.  రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ వంటి అనేక ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ పనితీరును మదింపు చేసినట్లు తెలిపారు. ఈ సిస్టమ్స్‌ను వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
 టెర్మినల్ పాయింట్ వద్ద రెండు డౌన్-రేంజ్ నౌకలు సహా ఫ్లైట్ పాత్‌లో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మిసైల్ మొదటి రెండు పరీక్షలు గత ఏడాది జూన్, డిసెంబరు నెలల్లో జరిగాయని, ఈ రెండు పరీక్షల్లోనూ ఈ మిసైల్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని తెలిపారు. 
అగ్ని క్లాస్ మిసైల్స్‌లో అగ్ని ప్రైమ్ (అగ్ని-పీ) నవతరానికి సంబంధించిన అత్యాధునికమైనది.  ఈ క్షిపణి 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల మధ్య దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని వారు వివరించారు. ఇదే ప్రాంతం నుంచి గత ఏడాది డిసెంబర్ 18న ఈ క్షిపణి విజయవంతంగా పాటవ పరీక్ష జరుపుకున్నట్లు వారు తెలిపారు.