తెలంగాణలో బీజేపీని మరింత శక్తివంతం చేయడంపై దృష్టి సారించిన ఆ పార్టీ జాతీయ నాయకత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒక సీనియర్ నేతను రాజకీయ వ్యవహారాల ఇన్చార్జిగా, మరో సీనియర్ నేతను సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జిగా నియమించిన అధిష్ఠానం తాజాగా సహ ఇన్చార్జిని కూడా నియమించింది.
పార్టీ జాతీయ కార్యదర్శి, సీనియర్ నేత, కేరళకు చెందిన అర్వింద్ మీనన్కు సహ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శిగా ఉన్న మీనన్ మధ్యప్రదేశ్లో ఆరెస్సెస్ ప్రచారక్గా సుమారు 15 ఏళ్లు పని చేశారు. గత జూలైలో హైదరాబాద్లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఇప్పుడు ఇన్చార్జులుగా ఉన్న తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్కు తోడు మీనన్ను సహ ఇన్చార్జిగా నియమించడం తెలంగాణకు బీజేపీ అధిష్ఠానం ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తోందో నిదర్శనమని పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం త్రిపుర, తెలంగాణ వంటి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో సహా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇంచార్జ్లు, కో ఇంచార్జ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మధ్యప్రదేశ్ ఇంచార్జ్గా మాజీ ప్రధాన కార్యదర్శి మరళీధర్ రావును కొనసాగిస్తూ, కేరళ ఇంచార్జ్గా మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను నియమించారు. బిహార్కు ప్రధాన కార్యదర్శిగా వినోద్ తావ్డే నియమితులు కాగా, కో-ఇన్చార్జిగా హరీష్ ద్వివేది కొనసాగనున్నారు.
ఇటీవలే పార్లమెంటరీ బోర్డులో నియమితులైన ఓం మాథుర్ను ఛత్తీస్గఢ్కు ఇన్చార్జిగా నియమించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రకు ఈశాన్య ప్రాంతానికి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్కు పార్టీ హర్యానా ఇన్చార్జిగా నియమించారు.
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న త్రిపుర ఇన్చార్జిగా ఉన్న వినోద్ సోంకర్ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి, నోయిడా ఎంపీ డాక్టర్ మహేష్ శర్మను నియమించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి పంజాబ్, చండీగఢ్లలో సంస్థాగత బాధ్యతలు కూడా అప్పగించారు.
బెంగాల్ కు బీహార్ లో మాజీ మంత్రి మంగళ్ పాండే కొత్త ఇన్చార్జిగా ఉండనున్నారు. అయితే అమిత్ మాల్వియా కోఇన్చార్జిగా కొనసాగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేరళకు కొత్త ఇన్చార్జిగా నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా రాజస్థాన్ ఇన్చార్జిగా కొనసాగుతారు.
జార్ఖండ్లో జాతీయ ప్రధాన కార్యదర్శి దిలీప్ సైకియా స్థానంలో లక్ష్మీకాంత్ బాజ్పాయ్ నియమితులయ్యారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ నుంచి భాజపాయ్ను రాజ్యసభకు తీసుకొచ్చి రాజ్యసభలో పార్టీ చీఫ్ విప్గా కూడా నియమించారు. వివిధ సామజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, గతంలో అధికార పదవుల్లో ఉన్న వ్యక్తులను సంస్థాగత పనుల్లో నిమగ్నమయ్యేలా నియామకాలు చేసినట్లు తెలుస్తోంది.
దీంతోపాటు 2023 సంవత్సరం ప్రారంభంలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ఏడాది సమయంలో కర్నాట అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పొత్తు పెట్టుకుని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, 2018లో త్రిపుర ఎన్నికలతో అందరినీ అబ్బురపరిచిన ఆ పార్టీ మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది.
మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికారంలో కొనసాగుతుండగా, గత ఎన్నికల్లో ఓడిపోయిన ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి రావడం వారికి గట్టి సవాలుగా మారనుంది.
రాజ్యసభకు విప్లవ్దేవ్
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్దేవ్ను రాజ్యసభకు పంపించాలని భారతీయ జనతాపార్టీ తాజాగా నిర్ణయించింది. త్రిపుర రాష్ట్రంలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిగా విప్లవ్దేవ్ పేరును ప్రకటించింది.
మాజీ ముఖ్యమంత్రి దేవ్ను శుక్రవారం హర్యానా రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జీగా నియమిస్తున్నట్లు బీజేపీ ప్రకటించిన వెంటనే అతనికి రాజ్యసభ సభ్యుడిని చేయాలని నిర్ణయించింది. గత మేలో ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మాణిక్ సాహ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంకు ఇప్పుడు ఎన్నిక జరుగనున్నది.
More Stories
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు