2024 లోక్సభ ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే, అమిత్ షా నాయకత్వంలో బిజెపి దక్షిణ భారతదేశంలో తన ప్రాబల్యాన్ని విస్తరించడానికి సౌత్ మిషన్ బ్లూప్రింట్ను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ అండదండలతో, ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు ఈ మిషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సంఘ్ నిర్మించిన బలమైన నెట్వర్క్ను దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేశారు.
అమిత్ షా 2014లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడే ఇప్పటి వరకు పార్టీ ఒకసారి కూడా అధికారంలోకి రాలేని దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రకటించారు. ఆ తర్వాత అస్సాంతో సహా పలు ఈశాన్య రాష్ట్రాలలో అధికారంలోకి రాగలిగారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా సమీప భవిష్యత్తులో అధికారంలోకి రాగలమనే ధీమాతో ఉన్నారు.
అయితే, మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఆ వ్యూహాలు ఫలించలేదు. ఇతర పార్టీల నుండి పేరొందిన నాయకులను దిగుమతి చేసుకోవడం, ఇతర రాష్ట్రాల నుండి సొంత నాయకులను తీసుకు రావడం, ప్రముఖ సినీ తారలను ఆకట్టుకోవడం, ప్రాంతీయ పార్టీలలో చీలికలను ప్రోత్సహించడం వంటి అనేక ప్రణాళికలు చెప్పుకోదగిన ఫలితాలు ఇవ్వలేదు.
గతంలోని కొన్ని వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో పార్టీ ఇప్పుడు దక్షిణాదిని విస్తరించేందుకు, 2024 ఎన్నికలలో కొత్త ఎన్నికల విజయాలను సాధించేందుకు కొన్ని కీలక మార్పులతో సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. దక్షిణాది రాజకీయాలు ఉత్తరాదికన్నా భిన్నమైనవని పార్టీ నాయకత్వం గ్రహించింది.
ఉత్తరాదిలో మంచి ఫలితాలు ఇస్తున్న హిందుత్వ రాజకీయాలకు భిన్నమైన రీతిలో, సైదంతిక అంశాలకు, సంక్షేమ కార్యక్రమాలకు మధ్య గల సరిహద్దులను అధిగమించి దక్షిణాది ప్రజలకు ఆమోదయోగ్యమైన పార్టీగా నిలబడే కృషి ప్రారంభించారు.
వారసత్వ రాజకీయాలపై పోరు
ఐదు దక్షిణాది రాష్ట్రాలలో మూడింటిలో ప్రాంతీయ పార్టీలు రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నందున, ఈ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడానికి బిజెపి వారసత్వ రాజకీయాలపై పోరాటం ఆయుధంను ఎంచుకొంటున్నది. కాంగ్రెస్-ముక్త్ భారత్, అవినీతి రహిత భారతదేశం 2014 నుండి ప్రముఖ బిజెపి నినాదాలు. అయితే 2024లో `వారసత్వ ముక్త -భారత్’ నినాదాన్ని జోడింపనున్నది. తద్వారా యువతను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కేడర్ను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభించి ప్రధాని మోదీ తరచూ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రసంగిస్తున్నారు. దేశభక్తికి బదులుగా “కుటుంబ భక్తి రాజకీయాలు” అనుసరిస్తున్న కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలను ప్రస్తావిస్తూ, మోదీ ఇలా అన్నారు:
“ఈ వ్యక్తులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండవచ్చు. కానీ వారు వారసత్వ రాజకీయాల తీగలతో ప్రతి ఒక్కరినీ కవర్ చేస్తారు. ఇతరుల అవినీతి. జాతీయ స్థాయిలోనూ, కొన్ని రాష్ట్రాల్లోనూ తమ కుటుంబాల ప్రయోజనాల కోసమే పని చేసే రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. వారసత్వ ప్రభుత్వాలలో, కుటుంబ సభ్యులకు స్థానిక సంస్థ నుండి పార్లమెంటు వరకు ప్రతిదానిపై నియంత్రణ ఉంటుంది … ఇటువంటి కుటుంబ పార్టీలు ఈ దేశంలోని యువతను పురోగతికి అనుమతించలేదు, వారు ఎల్లప్పుడూ ఈ పార్టీలచే ద్రోహానికి గురవుతున్నారు”.
దక్షిణాది రాష్ట్రాల్లో మోదీకి, బీజేపీకి ఇటువంటి మాటలు రాజకీయంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా “హిందుత్వ” అంశాన్ని మించి ఇతర మతాలలో వెనుకబడిన వర్గాలపై దృష్టి సారింపమని మోదీ సూచించడం ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొనే అని చెప్పవచ్చు.
ఎంపిక చేసిన నియోజకవర్గాలపై దృష్టి
అంతేకాకుండా, ఎన్నికలలో ఇప్పటికీ ప్రాబల్యం చూపించలేక పోతున్న రాష్ట్రాల్లో పార్టీ సరికొత్త విధానాన్ని ఆవలంభించ వలసిన అవసరాన్ని గుర్తించింది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో బిజెపి పటిష్టంగా లేదన్నది వాస్తవం. కాబట్టి పార్టీ మొత్తం రాష్ట్రంపై దృష్టి పెట్టకుండా, కొన్ని నియోజకవర్గాలను కైవసం కోవడంపై దృష్టి సారిస్తూ, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పచెప్పి,సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేపట్టనుంది.
ఉదాహరణకు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు సాపేక్షంగా మెరుగైన పనితీరు కనబరిచిన కేరళలోని లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజేలను ఇన్ఛార్జ్లుగా నియమించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణలో నియోజకవర్గాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు.
తమిళనాడులో, రాష్ట్రంలోని ఉత్తరాది ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఆ సామాజికవర్గ ప్రభావాన్ని ఉపయోగించుకునేలా, ఆధిపత్య వన్నియార్లను ఆకర్షించడానికి పార్టీ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. దాదాపు 150 బలహీన నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ‘ప్రవాస్’ ప్రచారంతో పాటు రూపొందించిన కొత్త వ్యూహం, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి, ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలను వెల్లడి చేస్తుంది.
ఇప్పటి వరకు దక్షిణాదిన చేస్తున్న ప్రయత్నాలు తగు ఫలితాలు ఇవ్వకపోవడం గ్రహించి, సరికొత్త వ్యూహాలతో బిజెపి సరికొత్త సౌత్ మిషన్ను సిద్ధం చేశారు. ఉదాహరణకు, తమిళనాడులో, రజనీకాంత్ వంటి ప్రముఖ స్టార్ను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నించి విఫలమైంది.
ఏఐఏడీఎంకేతో పొత్తు కూడా ఆశించిన ప్రయోజనం చేకూర్చలేక పోయింది. అదేవిధంగా, కేరళలో, భరత్ ధర్మ జన సేన (బిడిజెఎస్) ద్వారా ఓబిసి ఈజ్వా కమ్యూనిటీని ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు మాజీ నమ్మకస్తుడైన ఈటెల రాజేందర్ ను పోటీకి దింపి హుజూరాబాద్ అసెంబ్లీ సీటును బీజేపీ గెలుచుకో గలిగింది.
ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలోని కొన్ని నియోజకవర్గాలపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారిస్తుండగా, తెలంగాణ మాత్రం బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి బలమైన అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రముఖ క్రీడాకారిణి పి టి ఉష (కేరళ), సంగీత మాంత్రికుడు ఇళయరాజా (తమిళనాడు), వితరణశీలి వీరేంద్ర హెగ్డే, సినీ రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)లను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్య దక్షిణాది రాష్ట్రాలపై దాని కొత్త జోరులో భాగమే.
పైగా, తెలంగాణ నుండి డా. లక్ష్మణ్ కు, కర్ణాటక నుండి యడ్డ్యూరప్పకు పార్టీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలలో స్థానం కల్పించారు. డా. లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. సంస్థాగత వ్యవహారాలలో నిపుణుడైన సునీల్ బన్సల్ ను తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ లలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా పంపారు. ఏ మూడు రాష్ట్రాలలో అడిహకారంలోకి రావడంకోసం కృషి చేస్తుండడం తెలిసిందే.
More Stories
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి