బీజేపీ తెలంగాణ ఇంఛార్జిగా సునీల్ బన్సల్

బీజేపీ తెలంగాణ ఇంఛార్జిగా సునీల్ బన్సల్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతూ ఉండడంతో వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో అడిహకారంలోకి రావాలని పట్టుదలతో, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ను మార్చింది.
ప్రస్తుతం రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ స్థానంలో సునీల్ బన్సల్ను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు .కేంద్రహోంమంత్రి అమిత్‌ షాకు బీజేపీ కొత్త ఇన్‌చార్జ్‌గా నియమితులైన సునీల్‌ బన్సాల్‌ అత్యంత సన్నిహితుడుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు ముందుకు పోతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారింది.
సునీల్ బన్సల్ ప్రస్తుతం బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవోన్నతి కల్పించి, దీంతో పాటు తెలంగాణ, బెంగాల్, ఒడిశాలకు ఇంఛార్జ్గా నియమించారు. ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ గా తరుణ్ చుగ్ వ్యవహరించారు.
అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణలో పట్టు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అధినాయకత్వం సునీల్ బన్సల్కు రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.
1969 సెప్టెంబర్ 20న రాజస్థాన్ లో జన్మించిన సునీల్. ఏబీవీపీ నాయకుడిగా ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా వ్యవహరించారు. 2010 నుంచి 14 వరకు యూత్ ఎగైన్స్ట్ కరప్షన్ నేషనల్ కన్వీనర్ గా పనిచేశారు.
 2014లో యూపీ ఎన్నికల కో ఇంఛార్జ్ గా పనిచేసిన ఆయన.. 2017లో ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందారు.  బీజేపీ ప్రధాన వ్యూహకర్తల్లో బన్సాల్‌ ఒకరు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తేవటంలో కీలకంగా వ్యవహరించారు. 2022లోనూ యోగి ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యేందుకు సాయపడ్డారు.