2022 ఆర్చరీ ప్రపంచ కప్‌లో సురేఖకు రెండు పతకాలు

2022 ఆర్చరీ ప్రపంచ కప్‌లో సురేఖకు రెండు పతకాలు

తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3లో ఒకేరోజు రెండు పతకాలు గెలుచుకొంది. సహచర ఆర్చర్‌ అభిషేక్‌ వర్మతో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన 25 ఏళ్ల సురేఖ.. ఇదే ఈవెంట్‌ వ్యక్తిగత విభాగంలో రజత పతకం దక్కించుకొంది. 

శనివారం పారిస్ లో జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో మూడోసీడ్‌ సురేఖ-అభిషేక్‌ జోడీ 152-149 స్కోరు తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన జీన్‌ బాల్చ్‌-డాడ్‌మంట్‌ జంటను చిత్తుచేసి చాంపియన్‌గా నిలిచింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌ పసిడి పతకం కావడం విశేషం.

 కాంపౌండ్‌ విభాగంలో అత్యంత విజయవంతమైన జోడీగా  పేరుగాంచిన సురేఖ-అభిషేక్‌ జోడీ అత్యుత్తమంగా గతేడాది ఇదే టోర్నీలో రజతం సాధించింది. ఆ తర్వాత జరిగిన కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్‌ సురేఖ షూటా్‌ఫలో బ్రిటన్‌ ఆర్చర్‌ ఎల్లా గిబ్సన్‌ చేతిలో ఓటమిపాలై రజత పతకం అందుకుంది. 

అత్యంత ఉత్కంఠగా సాగిన తుదిపోరులో ఇద్దరూ దీటుగా బాణాలు సంధించడంతో 148-148తో స్కోరు సమమైంది. అభిషేక్‌ వర్మకు ఇది మూడో గోల్డ్‌ మెడల్‌. టర్నీ, సౌత్‌కొరియాల్లో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ కప్‌ టోర్నీలో మెన్స్‌ కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు.

32ఏళ్ల అర్జున అవార్డీ గ్రహీత గ్వాంగ్జులోని మిక్స్‌డ్‌ టీం విభాగంలో అవ్‌నీత్‌ కౌర్‌తో కలిసి జ్యోతి సురేఖ రజత పతకం చేజిక్కించుకుంది. సెమీస్‌లో ఈస్టోనియా జోడీని వర్మ- సురేఖ జంట ఓడించింది.

ఇక, ఈ టోర్నీలో భారత్‌ ఖాతాలో ఆదివారం మూడో పతకం చేరనుంది. ఇప్పటికే మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో దీపికా కుమారి, అంకితా భట్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌తో కూడిన భారత త్రయం ఫైనల్‌కు దూసుకెళ్ళింది.  టైటిల్‌ పోరులో చైనాతో భారత బృందం తలపడనుంది.