నాజల్ వ్యాక్సిన్ మూడో విడత ప్రయోగాలు పూర్తి

భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న నాజల్ వ్యాక్సిన్ ( నాసికా రంధ్రాల ద్వారా ఇచ్చేది) మూడో దశ ప్రయోగాలు పూర్తయ్యాయి. ఆ సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా వెల్లడించారు.  వచ్చేనెల ఈ వివరాలను డీసీజీఐకు అందజేయనున్నట్లు తెలిపారు. 
 
ఐరోపా లోనే అతిపెద్ద స్టార్టప్ , టెక్ ఈవెంట్ అయిన విష టెక్నాలజీ 2022 లో వక్తగా ప్రసంగించేందుకు ఆయన పారిస్ వెళ్లారు. తాము ఇప్పుడే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొన్నామని, ఆ డేటా విశ్లేషణ ప్రక్రియ జరుగుతోందని, వచ్చేనెల ఆ డేటాను రెగ్యులేటరీ ఏజెన్సీకి అందజేస్తామని చెప్పారు. 
 
ఈ ఏడాది జనవరిలో భారత్‌ బయోటెక్‌ సంస్థ నాజల్‌ వ్యాక్సిన్‌ 3వ దశ ప్రయోగాలకు నియంత్రణా సంస్థలు అనుమతలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.  అన్నీ సానుకూలంగా ఉంటే టీకా విడుదలకు అనుమతులు వస్తాయి. అప్పుడు ఇది క్లినికల్ గా నిరూపితమైన తొలి నాజల్ కరోనా  వ్యాక్సిన్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.
 రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కృష్ణా ఎల్లా సూచించారు. ప్రతి టీకాకు ఇచ్చే బూస్టర్ డోసు అద్భుతమని పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లల్లో బూస్టర్ డోసు అద్భుతంగా పనిచేసిందని వెల్లడించారు. కరోనాను వందశాతం నిర్మూలించలేమని పేర్కొంటూ  అందుకే పెద్దలు కూడా బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది జనవరిలో భారత్ బయోటెక్ సంస్థ నాజల్ వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగాలకు నియంత్రణ సంస్థలు అనుమతులు మంజూరు చేశాయి.