కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నరికివేత

కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నరికివేత
కేరళలోని పాలక్కాడ్‌ టౌన్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఒకరిని ఒక వర్గం వారు శనివారం మధ్యాహ్నం దారుణంగా నరికి చంపారు. పాలక్కాడ్  పట్టణం మేళమూరిలో  షాపు నడుపుతున్న శ్రీనివాసన్ (45)‌ను అక్కడకు చేరుకున్న దుండగులు దాడి చేశారు. ఆర్ఎస్ఎస్ శారీరక ప్రముఖ్ గా పనిచేశారు.
 
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సంజిత్ హత్య జరిగిన దాదాపు 5 నెలల తర్వాత, కేరళలోని అదే జిల్లాలో ఈ సంఘటన జరగడం గమనార్హం. 
మూడు మోటార్ బైక్‌లపై ఐదుగురు అగంతకులు వచ్చారని, తీవ్రంగా గాయపడిన శ్రీనివాసన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే కన్నుమూశాడని చెబుతున్నారు.
పాలక్కాడుకు సమీపంలోని ఓ గ్రామంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నేతను చంపిన 24 గంటలు కూడా తిరక్కుండానే తాజా ఘటన చోటుచేసుకుంది.  శ్రీనివాసన్ పై 20 కత్తిపోట్లు పొడిచిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తం శుక్రవారం సంఘటన తర్వాత మొత్తం పాలక్కాడ్ జిల్లాలో `హై అలెర్ట్’ ప్రకటించినప్పటికీ ఈ హత్య చోటుచేసుకోవడం గమనార్హం. 
 
శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వస్తుండగా పీఎఫ్ఐ నేత సుభైర్ (43)ను దుండగులు ఎలప్పుల్లి వద్ద నరికి చంపారు. కాగా, శ్రీనివాసన్‌పై దాడి, హత్య వెనుక సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉందని బీజేపీ ఆరోపించింది.
“ఈ దాడుల వెనుక ఎస్‌డిపిఐ హస్తం ఉందని స్పష్టంగా అర్థమైంది” అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.కృష్ణకుమార్ విమర్శించారు. గత డిసెంబరులో అలప్పుజ జిల్లాలో ఎస్‌డిపిఐ, బిజెపి ఓబిసి మోర్చా కార్యకర్తలు ఇదే విధంగా వరుసదాడులలో హతమయ్యారు. వరుస దాడులతో, పాలక్కాడ్ ఇప్పుడు రాజకీయ హింసకు  కొత్త హాట్‌స్పాట్‌గా ఉద్భవించింది.