శ్రీ పద్మావతి నిలయంలో మార్పులు చేయవద్దన్న హైకోర్టు 

శ్రీ పద్మావతి నిలయంలో మార్పులు చేయవద్దన్న హైకోర్టు 

తిరుపతిలో టిటిడి యాత్రికులకు నిర్మించిన  శ్రీ పద్మావతి నిలయంలో ఎటువంటి మార్పులు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిని కొత్తగా ఏర్పాటు చేయబోయే బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు ఇస్తూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన  ప్రొసీడింగ్స్‌ పై న్యాయస్థానం విచారణ జరిపింది. 

 యాత్రికుల విరాళాలతో వచ్చిన సొమ్ముతో పద్మావతి నిలయం ఏర్పాటు చేశారని, అలాంటి భవనాన్ని కలెక్టరేట్‌ కోసం కేటాయించడం సమంజసం కాదని, నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కలెక్టరేట్‌ ఏర్పాటుకు ఇచ్చిన ప్రోసీడింగ్స్‌పై యథాతథస్థితి పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆ  భవనంలో ఎలాంటి మార్పులు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు అదేశాలు జారీ చేస్తూ .. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.
నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో తిరుపతి కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న శ్రీ బాలాజీ జిల్లాకు కలెక్టరేట్‌ సద్ధమైంది. 

ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ జిల్లాకు సంబంధించి తాత్కాలికంగా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా అక్కడ శ్రీ బాలాజీ జిల్లా కలెక్టర్‌ బోర్డునూ ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారులు సంబంధిత మిగిలిన పనుల్లో నిమగమయ్యారు. 

పద్మావతి నిలయంలో కలెక్టరేట్‌ మాత్రమే ఏర్పాటు చేయాలని అధికారులు ముందస్తుగా నిర్ణయించారు. ఇక్కడ 200 వరకు గదులు ఉండగా,దానికి తోడు ప్రతి గదీ విశాలంగా ఉండటం కలిసొచ్చింది. దీంతో అధికారులు వివిధ శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలనూ పద్మావతి నిలయంలోనే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. 

ఒక్కో గదిలో పర్యవేక్షకుల (సూపరింటెండెంట్‌) స్థాయి అధికారితోపాటు ముగ్గురు గుమాస్తాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గదులు కేటాయించి, నంబర్లు ఇచ్చారు. అవసరమైన పనులు చేయడంలో నిమగమయ్యరు. ఈ నెలకారులోగా పనులు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పద్మావతి నిలయంలో కలెక్టరేట్‌ ఏర్పాటు పనులపై హైకోర్టు యథాతధ స్థితి పాటించాలని ఆదేశించడంతో అధికారుల్లో సందిగ్థత నెలకొంది.