కృష్ణపట్నం లీజుపై తెలంగాణ అభ్యంతరం 

కృష్ణపట్నం లీజుపై తెలంగాణ అభ్యంతరం 

 కృష్ణపట్నంలో శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (ఎస్‌డిఎస్‌ఎస్‌టిపిఎస్‌) లీజుపై తెలంగాణ డిస్కంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటేడ్‌ (ఎపిసిపిడిసిఎల్‌)బోర్డు సమావేశం సోమవారం ఎపి జెన్‌కో సిఎండి బి శ్రీధర్‌ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో జరిగింది. 

ఈ సమావేశంలో లీజు అంశంపై సిఎండి చెప్పిన విషయాలపై తెలంగాణ డిస్కమ్‌ల అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో తమ అభిప్రాయాలను చెప్పడానికి తమకు కనీసం రెండు వారాల సమయం కావాలని కోరారు. దీంతో బోర్డు సమావేశం వాయిదా పడింది. 

కృష్ణపట్నం ప్లాంట్‌లో ఎపి జెన్‌కోకు 51శాతం, ఎపి ప్రభుత్వానికి 4 శాతం, తెలంగాణ డిస్కంలకు 27 శాతం, ఎపి డిస్కంలకు18 శాతం భాగస్వామ్యంగా ఉన్నాయి. అంతకుముందు సిఎండి శ్రీధర్‌ మాట్లాడుతూ ప్లాంట్‌ నిర్వహణ జెన్‌కోకు కష్టంగా ఉందని, నిర్వహణ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 

అందుకోసం కన్సల్టెన్సీ ఏర్పాటు చేయాలని ప్రస్తావించిన్నట్లు సమాచారం. ఖర్చు తగ్గించుకునే క్రమంలో సిబ్బందిని తగ్గించాలనే ప్రస్తావన కూడా చేశారు. లీజుకు ఇచ్చే ప్రైవేట్‌ సంస్థకే సిబ్బందిని అప్పగిస్తే ఉద్యోగుల వేతనాల ఖర్చు తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్లాంట్‌లో మిగిలిన వారిని ఇతర ప్లాంట్లకు బదిలీ చేయవచ్చనే తెలిపారు.