నవంబర్ 5న కేదార్‌నాథ్‌కు ప్రధాని మోదీ

నవంబర్ 5న కేదార్‌నాథ్‌కు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 5న కేదార్‌నాథ్‌ను దర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ. 250 కోట్లతో చేపట్టిన కేదార్‌పురి పునర్మిర్మాణ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. నెలరోజుల్లో ఆయన ఉత్తరాఖండ్‌ను దర్శించనుండడం ఇది రెండవసారి. 
 
అక్టోబర్ 7న ప్రధాని రిషికేష్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. నవంబర్ 7న ప్రధాని మోదీ కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు నిర్వహించడంతోపాటు పునర్నిర్మించిన జగద్గురు ఆదిశంకరాచార్య సమాధితోపాటు రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
 
అంతేగాక రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రెండవ దశ కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపటిన తర్వాత మోదీ పలుమార్లు కేదార్‌నాథ్‌ను సందర్శించారు. అయితే కరోనా కారణంగా ఆయన గత ఏడాది కేదార్‌నాథ్‌ను సందర్శించలేకపోయారు. 
 
కరోనా పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉండడంతో ఆయన కేదార్‌నాథ్‌ను సందర్శిస్తారని గత కొద్ది రోజులుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కేదార్‌నాథ్ పునర్నిర్మాణ ప్రాజెక్టును ప్రధాని మోదీ  స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భైయ్య పూజ సందర్భంగా నవంబర్ 6న శీతాకాలం కోసం కేదార్‌నాథ్ పోర్టల్స్ మూసివేయనున్నారు.