సోనూసూద్‌ పై ఆరు చోట్ల ఐటి సోదాలు!

ప్రముఖ నటుడు సోనూసూద్‌కు చెందిన ముంబయిలోని నివాసంలో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. అలాగే ముంబయిలో ఆయనకు సంబంధించిన మరికొన్ని చోట్ల, లఖ్‌నవూలోని కంపెనీలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 

మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈ త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. సోనూసూద్‌కు సంబంధించిన‌ ఆదాయ వివ‌రాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో సోనూసూద్ నివాసంలో ఐటీ శాఖ ఈ త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. 

కొన్ని నెలల క్రితం, ముంబై మున్సిపల్ అధికారులు కూడా సోనూపై కంప్లైంట్ నమోదు చేశారు. ఆయన ఆరు అంతస్థుల నివాస భవనాన్ని తగిన అనుమతులు లేకుండానే హోటల్‌గా మార్చాడంటూ వారు ఆరోపించారు.

కరోనా వైరస్ వ్యాప్తి  సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉండగా ఎందరో వలస కార్మికులను తమ తమ సొంత గ్రామాలకు చేర్చాడు సోనూ సూద్. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తమ రాష్ట్రాలకు తీస్కెళ్లడంలో పట్టించుకోని సమయంలో  కొన్ని వందల బస్సులను ఏర్పాటు చేసి కూలీలను తమ ఇళ్లకు చేర్చాడు. 

దీంతో దేశం మొత్తం అతడి సేవలను ఎంతగానో కొనియాడారు.రియల్  హీరో అని అన్నారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. అంతకు ముందు ఏకంగా ముంబై మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపుతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే, వాటన్నిటిపై స్పందించేందుకు సోనూసూద్ నిరాకరించాడు.