భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రోటావాక్ 5డి వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) ఆమోదం తెలిపింది. పిల్లల్లో రోటా వైరస్ నుంచి రక్షణకు ఇప్పటికే రోటావాక్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన ఈ సంస్థ వ్యాక్సిన్ను మరింత అభివృద్ధి చేసి రోటావాక్ 5 డి గా తయారు చేసింది.
బఫర్ సొల్యూషన్ అవసరం లేకుండా నిల్వచేయడం, 0.5 మి.లీ డోసేజ్లో టీకాను తీసుకురావడం, ఈ నూతన రోటావాక్ 5 డి ప్రత్యేకత. పిల్లల్లో ప్రబలంగా వ్యాపించే రోటా వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ మరింత రక్షణ కల్పించడమే కాక, నిల్వ, సరఫరాకు తక్కువ ఖర్చు అవుతుందని సంస్థ తెలిపింది.
డబ్లుహెచ్ఒ ఫ్రీ క్వాలిఫికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ సరఫరా మరింత వేగవంతం కానుందని భారత్ బయోటెక్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల్లో ప్రాణాంతక డయేరియా వ్యాధికి రోటా వైరస్ కారణమవుతోంది. ఈ వైరస్తో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి.
20 లక్షల మంది పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారు. రోటా వైరస్ కారణంగా సంక్రమించే వ్యాధులకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఫస్ట్ జనరేషన్ రోటావాక్ వ్యాక్సిన్ అడ్డుకట్ట వేసింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్ డోసుల రోటావాక్ టీకాలను భారత్ బయోటెక్ సరఫరా చేసింది.
రోటా వాక్ 5డి వ్యాక్సిన్ తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంటుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఐదు చుక్కల 0.5 ఎంఎల్ డోసేజ్తో నోటి ద్వారా ఇచ్చే ఈ మోనోవాలెంట్ టీకాను నాలుగు వారాల తేడాతో మూడు డోసుల్లో చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎనిమిది నెలల లోపున్న పిల్లలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి.
భారత్ బయోటెక్ 30 ఏళ్ల కృషి ఫలితమే ఈ వ్యాక్సిన్ల అభివృద్ధి అని బయోటెక్ జేఎండి సుచిత్ర ఎల్లా అన్నారు. నిర్లక్షానికి గురైన లక్షల మందిలో ప్రాణాంతకమయ్యే వ్యాధులను అరికట్టేందుకు భారత్ బయోటెక్ పరిశోధనలు కొనసాగిస్తుందని ఆమె పేర్కొన్నారు.
More Stories
మసాలా సుగంధ ద్రవ్యాలపై దేశవ్యాప్తంగా తనిఖీలు
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు