20 లక్షల భారతీయుల వాట్సాప్‌ ఖాతాల తొలగింపు

20 లక్షల భారతీయుల వాట్సాప్‌ ఖాతాల తొలగింపు

భారతీయ ఖాతాలపై వాట్సాప్‌ కొరడా ఝుళిపించింది. ఏకంగా 20 లక్షల భారతీయుల ఖాతాలను బ్యాన్‌ చేసింది. మే 15 నుంచి జూన్‌ 15 మధ్యన ఈ ఖాతాలను నిలిపివేసినట్టు తెలిపింది. నూతన ఐటి నిబంధనలకు అనుగుణంగా ఈ కఠినచర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

ఫేస్‌ బుక్‌ ఆధ్వర్యంలోని ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారతదేశంలో 5 మిలియన్ల ఫేస్‌బుక్‌ యూజర్లు ఉన్నారు. కొత్త ఐటి చట్ట ప్రకారం సోషల్‌ మీడియా యాప్‌ లు ప్రతి నెల కేంద్రానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 

ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ సైతం ఈ నెలలో ఇదివరకే తమ నెలవారీ నివేదికలను కేంద్రానికి సమర్పించాయి. తన నెలవారీ నివేదికలో వాట్సాప్‌ ఏకంగా 20 లక్షల భారతీయుల ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు కేంద్రానికి సమర్పించింది.

హానికరమైన ప్రవర్తనతో కూడిన ఖాతాలను, అనవసరమైన సందేశాలను పంపే ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వాట్సాప్‌ స్పష్టం చేసింది. అనధికారికంగా బల్క్‌ మేసేజింగ్‌ వాడకం వల్లే ఎక్కువ ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు వివరించింది. అవాంఛనీయ ఖాతాలను గుర్తించేందుకు అనువైన సాధనాలను ఏర్పాటు చేశామని వెల్లడించింది. 

ఇలాంటి ఖాతాలను గుర్తించే ప్రక్రియ మూడు దశలు కలిగి ఉంటుందని, రిజిస్ట్రేషన్‌, సందేశాలు పంపే సమయం, ఫిర్యాదులు ఆధారంగా స్పందిస్తామని వివరించింది. ఇలాంటి ఖాతాలను ముందే గుర్తించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, హాని జరిగాక స్పందించడం కంటే, ముందే చర్యలు తీసుకోవడం సబబు అని భావిస్తున్నట్టు తన నివేదికలో వాట్సాప్‌ పేర్కొంది.