రైల్ టికెట్ రద్దు చేసిన వెంటనే రిఫండ్ 

రైలు టికెట్‌ బుక్‌ చేసుకొని అనుకోని కారణాల రీత్యా మళ్లీ రద్దు చేసుకున్నారా? టికెట్‌కు చెల్లించిన డబ్బులు తిరిగి మీ అకౌంట్‌లోకి జమ అయ్యేందుకు ఐఆర్‌సిటిసి నిబంధనల ప్రకారం మూడు రోజులు వేచి చూస్తున్నారా? అయితే ఇక నుంచి మీరు చెల్లించిన డబ్బులు కోసం మూడు రోజులు వేచి ఉండాల్సి పని లేదు.

ఎందుకంటే టికెట్‌ రద్దు చేసుకున్న వెంటనే రీఫండ్‌ వస్తుంది.  ఈ విషయాన్ని ఐఆర్‌సిటిసి స్వయంగా వెల్లడించింది. ఐఆర్‌సిటిసి తన వెబ్‌ సైట్‌, యాప్‌లో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్‌ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్‌ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. 

ఐఆర్‌సిటిసి చెల్లింపు గేట్‌వే ఐఆర్‌సిటిసి-ఐపే ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసే ప్రయాణికులు రద్దు చేసిన వెంటనే రీఫండ్‌ పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా ప్రచారంలో భాగంగా ఐఆర్‌సిటిసి-ఐపేను 2019లో ప్రారంభించింది. దీనికి సంబంధించి ఐఆర్‌సిటిసి తన వెబ్‌ సైట్‌ను కూడా అప్‌ గ్రేడ్‌ చేసింది.

ఐఆర్‌సిటిసి అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పెరుగుతున్న రైల్వే ప్రయాణీకుల సంఖ్యను దష్టిలో ఉంచుకొని, ఐఆర్‌సిటిసి తన యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ అప్‌ గ్రేడ్‌ చేసిందని, దీని వల్ల టిక్కెట్లు బుక్‌ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు.

ఈ కొత్త ఏర్పాట్ల వల్ల ప్రయాణికులు తత్కాల్‌, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్‌ చేయడమే కాకుండా రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేటట్లు వెబ్‌ సైట్‌, పోర్టల్‌ ఆధునీకరించినట్లు తెలిపారు.