తనను జైలుకు పంపవద్దని కేసీఆర్‌ పొర్లు దండాలు  

తనను జైలుకు పంపవద్దని కేసీఆర్‌ పొర్లు దండాలు  

సీఎం పదవి లేకున్నా సరేకానీ.. తనను, తన కుటుంబాన్ని జైలుకు పంపవద్దని ఢిల్లీ వచ్చి సీఎం కేసీఆర్‌ పొర్లు దండాలు పెట్టుకున్నారని బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. అయితే పొర్లు దండాలు పెట్టినా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

బీజేపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ, ఎంపీ అర్వింద్‌ను కలవడానికి ఢిల్లీ వచ్చిన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన దాదాపు 20 మంది టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శనివారం బండి సంజయ్‌ని కలిశారు. 

ఈ సందర్భంగా సంజయ్‌ విలేకరులతో మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్‌ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. సిగ్గు, బుద్ధి ఉన్నవారెవరూ టీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకోరని తేల్చి చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేయాల్సిన పరిస్థితి గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులకు ఏర్పడిందని విమర్శించారు. కేంద్రం నిధులే అభివృద్ధికి ఆధారమవుతున్నాయని పేర్కొన్నారు. స్మార్ట్‌ సిటీలుగా ప్రకటించిన వరంగల్‌, కరీంనగర్‌ నగరాలకు కేంద్రం రూ.392కోట్లు విడుదల చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని మండిపడ్డారు. 

కాగా, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల రజకులను ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రధానిని కల్పించి, వారి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

శనివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ, ఏపీ రజక, ధోబీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో  ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అసెంబ్లీలో రజకుల డిమాండ్లపై తీర్మానం చేయాలని సూచించారు. 

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రజకులను తీవ్ర వెనుకబాటుకు గురిచేశారని ఆరోపించారు. కాగా, కొవిడ్‌ నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రధాని మోదీ పాలనాదక్షుడిగా నిలిచారని కిషన్‌రెడ్డి చెప్పారు. మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ప్రధానికి 74ు రేటింగ్‌ ఇచ్చిందని వివరించారు.

నిజామాబాద్‌ రూరల్‌కు చెందిన 9 మంది ఎంపీటీసీలు, 10 మంది సర్పంచులు, ఇతర నేతలు ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరనున్నారు. 5న వరంగల్‌ కార్పొరేషన్‌లో, 7న బోధన్‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి వలసలు జరగనున్నాయి. టీపీసీసీ అధికార ప్రతినిధి దరువు ఎల్లన్న కూడా బీజేపీలో చేరనున్నారని పార్టీ నేతలు తెలిపారు.  

 ఈ నెల 7న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నాడని పార్టీ వర్గాలు తెలిపాయి.