కేంద్ర మాజీ మంత్రి బూటాసింగ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి బూటాసింగ్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటాసింగ్ (86) శనివారం కన్నుమూశారు. రాజీవ్ గాంధీ కేబినెట్‌లో 1986 నుంచి 89 వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా బిహార్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 

బూటాసింగ్ రాజకీయ కెరీర్ మొట్ట మొదటగా అకాలీదళ్ నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత 1960 ప్రాంతంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 1962 లో సాధ్నా నియోజకవర్గం నుంచి మొట్టమొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2007 నుంచి 2010 వరకు కేంద్ర షెడ్యూల్డ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 

కేవలం రాజకీయంగానే కాకుండా సాహిత్య పరంగా కూడా ఈయన నిష్ణాతులే. పంజాబీ సాహిత్యంతో పాటు సిక్కు సాహిత్యంపై కాస్తంత మక్కువే. అనేక వ్యాస సంకలనాలు కూడా రాశారు.  ‘పంజాబీ స్పీకింగ్ స్టేట్’ పేరుతో ఓ పుస్తకాన్ని వెలువరించారు. 

‘‘బూటాసింగ్ ఓ మంచి పరిపాలనాదక్షులు. పేద ప్రజలు, నిమ్న వర్గాల కోసం గొంతెత్తిన ధీరోదాత్తుడు. ఆయన మరణించడం బాధాకరం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాడఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

‘‘దేశం నిజమైన ప్రజా సేవకుడ్ని, నమ్మకమైన నాయుడ్ని కోల్పోయింది. దేశ ప్రజానీకం కోసం, దేశహితం కోసం బూటాసింగ్ సర్వస్వాన్నీ ధారబోశారు. అందుకే ఆయన జీవితాంతం గుర్తుండిపోతారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. .’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.