`బ్రాండ్ ఇండియా’ పై దృష్టి నిలపాలి   

ఐఐఎం విద్యార్థులు `బ్రాండ్ ఇండియా’ పై దృష్టి నిలపాలని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ పిలుఇచ్చారు. దేశంలోని నిమ్న వర్గాల కోసం పాటుపడాలని కోరారు.  ఒడిశాలోని ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) నూతన క్యాంపస్‌కు ప్రధాని శనివారం శంకుస్థాపన చేశారు.

ప్రాదేశికం నుంచి అంతర్జాతయ వైపు ఎదగాలని ఐఐఎమ్ విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. ‘‘ప్రాదేశికం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. కొత్తరకం మార్గాలను అన్వేషిస్తూ సాగాలి. మనదేశంలో 20 ఐఐఎంలు ఉన్నాయి. ఇంతటి విజ్ఞాన భాండాగారం ఆత్మనిర్భర, స్వావలంబన భారత్‌కు సహాయపడాలి.’’ అని మోదీ పిలుపునిచ్చారు.

అన్ని వర్గాల అభివృద్ధి దేశంలో జరగాలని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఈ దశాబ్దం భారత్ లో కొత్త బహుళజాతి సంస్థల అభివృద్ధికి కేటాయిస్తున్నాం. నేటి స్టార్టప్‌లే రేపటి బహుళజాతి సంస్థలు. ఇవి ప్రధాన పట్టణాల్లో మరింత వృద్ధి చెందుతున్నాయి. ఈ స్టార్టప్‌లకు సమర్థవంతులైన నిర్వాహకులు అవసరం’ అని ప్రధాని పేర్కొన్నారు.

బ్రాండ్ ఇండియా కోసం మనం కష్టపడాలి. ఇది మన బాధ్యత. ఈ సంస్థలో విద్యనభ్యసించే వారు సమగ్రమైన అభివృద్ధి వైపు దృష్టినిలపాలని ప్రధాని సూచించారు.