జగన్‌కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

జగన్‌కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 48వ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అదేవిధంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌.. సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. వేంకటేశ్వరస్వామి, పూరి జగన్నాథుడి ఆశీస్సులతో జగన్‌ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. గవర్నర్‌ వ్యక్తిగత కార్యదర్శి బీసీ బెహెరా, గవర్నర్‌ ఏడీసీ ఎస్‌వీ మాధవరెడ్డి గవర్నర్‌ తరఫున సీఎంని కలిసి, ఒక లేఖ, ఒక మొక్కను అందించారు. 

ఇక, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌లు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునివ్వాలని కేటీఆర్‌ సూచించారు.

కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌లు సీఎం జగన్‌తో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేసి  వేడుక చేశారు.