వీటిలో హిందీ, తెలుగు, తమిళం, మరాఠీతో పాటు పలు భారతీయ భాషల చిత్రాలు ఉన్నాయి. తెలుగు నుంచి ‘పెద్ది’, ‘ఇరుముడి’, ‘సింగీతం’, ‘ఎగ్వా’ సినిమాలు పోటీలో ఉండగా; హిందీ నుంచి ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’, ‘హనుమాన్ అంశ్’, ‘హక్’, ‘120 బహదూర్’, ‘బోర్డర్ 2’ తదితర చిత్రాలు పరిశీలనకు వెళ్లాయి. అయితే వీటన్నింటిలో నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) ఎంపిక కమిటీ సంతోష్ దవాఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్’ను భారత్ తరఫున ఆస్కార్ ఎంట్రీగా ప్రకటించింది.
‘గోంధల్’ ఒక మరాఠీ థ్రిల్లర్. మహారాష్ట్రలో సంప్రదాయంగా జరిగే గోంధల్ అనే రాత్రిపూట జరిగే జానపద ఆచారం, సంగీతం, నృత్యం, పురాణ విశ్వాసాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సంప్రదాయాన్ని కేవలం నేపథ్యంగా చూపకుండా కథలోనే కీలకమైన భాగంగా దర్శకుడు ఉపయోగించారు. ఈ సినిమాలో సుమన్ అనే వివాహిత మహిళ ప్రధాన పాత్ర. పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆమె గోంధల్ కళాకారుడు సాహెబాతో సంబంధం, తన భర్త కుటుంబంలోని వ్యక్తులతో ఉన్న పరిస్థితుల మధ్య బయటపడేందుకు ఒక ప్రమాదకరమైన పథకం వేస్తుంది.
ఆ తర్వాత కథ ప్రేమ, కోరిక, మోసం, హత్య, తప్పించుకునే ప్రయత్నాల చుట్టూ ఉత్కంఠగా సాగుతుంది. ‘గోంధల్’లో కిశోర్ కదమ్, ఇషితా దేశ్ముఖ్, యోగేశ్ సోహోని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు, సురేశ్ విశ్వకర్మ, విఠల్ కాలే తదితరులు నటించారు. సినిమాకు సంతోష్ దవాఖర్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం వహించారు. సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అందించారు.
‘గోంధల్’ సినిమా అంతకుముందే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 2025లో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో సంతోష్ దవాఖర్కు బెస్ట్ డైరెక్టర్ విభాగంలో సిల్వర్ పీకాక్ అవార్డు లభించింది. బెంగళూరు, పుణే తదితర ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ ఈ సినిమాకు గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఇది భారత్ అధికారికంగా పంపిన ఎంట్రీ మాత్రమే. 99వ అకాడమీ అవార్డ్స్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తదుపరి దశలో షార్ట్లిస్ట్ ప్రక్రియ ఉంటుంది. 99వ ఆస్కార్ వేడుక 2027 మార్చి 14న లాస్ ఏంజెల్స్లో జరగనుంది.

More Stories
జెన్ జెడ్ ధర్మం గురించి చర్చించడం పట్ల మోహన్ భగవత్ హర్షం
టీఎంసీపై ఈసీ నిర్ణయంపై రాహుల్ విమర్శలను తిప్పికొట్టిన బిజెపి
మమతా మద్దతు తర్వాత కాంగ్రెస్ నందిగ్రామ్ అభ్యర్థి అరెస్ట్