బెంగాల్ ఉప ఎన్నికలు మైనారిటీ ఓటర్లకు ఓ పరీక్ష!

బెంగాల్ ఉప ఎన్నికలు మైనారిటీ ఓటర్లకు ఓ పరీక్ష!
నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలను మైనారిటీ ఓటర్లకు ఒక ప్రత్యక్ష రాజకీయ సందేశంగా సువేందు అధికారి మలిచారు. అక్టోబర్ 6న జరగనున్న ఈ పోటీని ఒక “పరీక్ష”గా అభివర్ణించిన ఆయన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకోవాలని వారిని కోరారు. తూర్పు మిడ్నాపూర్‌లోని హల్దియాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా లేదా అనేది నిరూపించుకునే అవకాశం ఈ రెండు నియోజకవర్గాల ఓటర్లకు ఉందని అధికారి చెప్పారు. 
 
అధికారి, ఏజేయుపి  అధినేత హుమాయూన్ కబీర్ తమ స్థానాలకు రాజీనామా చేయడం వల్ల అనివార్యమైన ఈ రెండు ఉప ఎన్నికల కోసం బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసిన తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీకి మద్దతు ఇవ్వని మైనారిటీ ఓటర్లకు, ఇప్పుడు ప్రభుత్వంతో జతకట్టాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశం ఉందని అధికారి పేర్కొన్నారు. 
 
ఈ ఏడాది ప్రారంభంలో కాల్చి చంపిన సువేందు అధికారి మాజీ సహాయకుడు చంద్రనాథ్ రాత్ తల్లి హసిరాణి రాత్‌ను బరిలోకి దించడం ద్వారా, బీజేపీ నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఒక భావోద్వేగ కోణాన్ని జోడించింది.  అలాగే, ముస్లిం మెజారిటీ నియోజకవర్గమైన రెజినగర్ నుండి అనుభవజ్ఞుడైన సంస్థాగత నాయకుడు, ముర్షిదాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు సఖరావ్ సర్కార్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.
హసిరాణి రాత్ నామినేషన్ దాఖలు చేయడంతో, ఆమె కుమారుడి మరణం అంశం నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో మళ్లీ ప్రధానాంశంగా మారింది. అధికారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన చంద్రనాథ్ రాత్, మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో కారులో ప్రయాణిస్తుండగా, మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఈ హత్య జరిగింది. ఈ కేసును మొదట రాష్ట్ర పోలీసులు, సిట్ దర్యాప్తు చేశాయి.ఆ తర్వాత దీనిని సిబిఐకి అప్పగించారు. తాను 1998 నుంచే రాజకీయాల్లో ఉన్నానని రాత్ తెలిపారు. ఆమె రెండుసార్లు పంచాయతీ సభ్యురాలిగా, మూడుసార్లు పంచాయతీ సమితి సభ్యురాలిగా పనిచేశారు. 
 
నందిగ్రామ్‌లో 1.10 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. “సువేందు అధికారి మా కుటుంబానికి పెద్ద దిక్కు,” అని పేర్కొన్న ఆమె, బీజేపీ తనకు అప్పగించే ఏ బాధ్యతనైనా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పారు. అక్టోబర్ 6 నాటి పోటీ ఒక ‘పరీక్ష’ అని పేర్కొన్న సువేందు అధికారి నామినేషన్ ప్రక్రియ కోసం హల్దియా ఎస్‌డిఓ కార్యాలయానికి వెళ్లేటప్పుడు అధికారి ఆమెతో పాటు వెళ్లారు.